
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త తరహా నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్న పేరు నారా లోకేష్. విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పనితీరు, తీరు రెండు గణనీయమైన మార్పులు చూపిస్తున్నాయి. ఒకప్పుడు విమర్శకులు ‘‘లోకేష్ ఫీల్డ్ లీడర్ కాదు, కేవలం పార్టీ పోస్టులకే పరిమితం’’ అని అనేవారు. కానీ ఇప్పుడు అదే లోకేష్, ప్రతి సమస్యపై తక్షణం స్పందించే నేతగా, పరిపక్వత కలిగిన నిర్ణయాధికారిగా రూపాంతరం చెందారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఆయనలో కనిపిస్తున్న ఈ మార్పు వల్లే రాజకీయ వర్గాలందరిలోనూ ‘‘లోకేష్ భవిష్యత్ ముఖ్యమంత్రి నోడౌట్” అని ఒక మాట వినిపిస్తోంది. ఇటీవల రెండు సంఘటనల్లో ఆయన ప్రదర్శించిన వివేకం, మానవతా దృష్టి, పరిపాలనా బాధ్యత కలయిక.. ఈ అభిప్రాయానికి మరింత బలం చేకూర్చింది.
శ్రీకాకుళం ఘటనలో మానవతా దృక్కోణం :
మొదటి సంఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో చోటుచేసుకున్న దుర్ఘటన. జాతర సందర్భంగా తొక్కిసలాట జరగడంతో 9 మందికిపైగా భక్తులు మరణించడం రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ సంఘటనతో చాలామంది భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు రాజకీయ వర్గాలు ఆ కోపాన్ని రాజకీయ ఆయుధంగా మార్చే ప్రయత్నం చేశారు. ‘‘ఆలయం కట్టించిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి’’, ‘‘దేవాలయాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి’’, ‘‘ఆ గుడి ట్రస్ట్పై కేసు పెట్టాలి’’ అనే ఒత్తిడి నారా లోకేష్పై తెచ్చారు.
కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘అది భక్తుల కృషితో, వారి సొంత డబ్బుతో నిర్మించిన ఆలయం. భక్తి కేంద్రాన్ని రాజకీయీకరించడం సరికాదు’’ అని స్పష్టంగా చెప్పారు. గుడి స్వాధీనం, మూసివేత వంటి ప్రతిపాదనలను తిరస్కరించి, ‘‘దుర్ఘటనను విచారించాలి కానీ భక్తి భావాన్ని దెబ్బతీయకూడదు’’ అన్న పద్ధతిలో మాట్లాడారు. ఇది ఒక సాదాసీదా స్పందన కాదు.. బాధ్యతగల మంత్రిగా, సమతుల్యమైన నేతగా, సాంస్కృతిక సున్నితత అర్థం చేసుకున్న నాయకుడిగా నారా లోకేష్ మన ముందుకు వచ్చిన సందర్భం.
నారా లోకేష్లో ఉన్న రాజకీయ పరిపక్వత. అనవసర ఒత్తిడికి లొంగకుండా, ప్రజా మనోభావాలను గౌరవిస్తూ, పరిపాలనా సమతుల్యతను నిలబెట్టిన తీరు ఏ నాయకుడికైనా తేలికైన విషయం కాదు.
కృష్ణా జిల్లా ఘటనలో తక్షణ స్పందన :
రెండో సంఘటన మానవతా విలువలతో పాటు, సెక్యూరిటీ అవగాహన కలిగిన నేతగా లోకేష్ను ప్రజల ముందుంచింది. కృష్ణా జిల్లాకు చెందిన కొందరు క్రైస్తవ భక్తులు తమిళనాడులోని వేలంగిణి మాత ఆలయానికి దర్శనార్థం వెళ్ళారు. అయితే వారి ప్రయాణంలో కొన్ని ప్రాంతీయ సమస్యలు తలెత్తాయి. స్థానిక ఆటో డ్రైవర్లు ఆ భక్తుల బస్సును అడ్డుకోవడం, వాగ్వాదాలు జరగడం, బెదిరింపులు ఇవ్వడం వంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ఆ బస్సులో ఉన్న ఒక పాస్టర్కి నారా లోకేష్ టీమ్ పరిచయం ఉండటంతో, ఆయనకు కాల్ చేశారు. లోకేష్ వెంటనే స్పందించారు. తమిళనాడు యువ మంత్రి ఉదయనిధి స్టాలిన్కు స్వయంగా ఫోన్ చేసి పరిస్థితి వివరించి, భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడి పోలీసులు వెంటనే స్పందించి, ఆ భక్తులకు ఎస్కార్ట్ సెక్యూరిటీ అందించి, సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకు భద్రతగా తీసుకువెళ్లి ఆంధ్ర సరిహద్దు వద్ద వదిలిపెట్టారు.
ఇది కేవలం ఒక ఫోన్ కాల్ కాదు.. ఒక నేతకు ఉండే విలువైన ‘‘హ్యూమన్ టచ్’’, అంతర్రాష్ట్ర సమన్వయం. ప్రాంతీయ భాషా, మత విభేదాలు తలెత్తే అవకాశం ఉన్న సందర్భంలో, వాటిని చాకచక్యంగా సర్దుబాటు చేసిన తీరు ఆయనలో ఉన్న ప్రజాసంబంధ నైపుణ్యాన్ని స్పష్టంగా చూపింది.
పరిణతి పొందిన నేతగా లోకేష్ :
నారా లోకేష్ ఇప్పుడు కేవలం పార్టీ వారసుడు కాదు, పూర్తిస్థాయి నిర్ణయాధికార నాయకుడు. ఆయనలో ఉన్న మానవతా స్పర్శ, సమయోచిత స్పందన, రాజకీయ సమతుల్యత ఇవన్నీ ఒక ‘‘ఫ్యూచర్ సీఎం’’ లక్షణాలే.. ఈ రెండు సంఘటనలు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాయి.
చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు కూడా ఇలాగే ప్రజలతో మమేకమై, ప్రతి అంశంలో మితభాషిగా వ్యవహరించారు. ఇప్పుడు అదే నాణ్యతను లోకేష్లో ప్రజలు గమనిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఎదురైన పరాజయం తర్వాత లోకేష్ పాఠాలు నేర్చుకున్నారు. ప్రజల్లోనే ఉన్నారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో, యువతతో అనుసంధానమవుతూ, రాజకీయ సంస్కారం, కమ్యూనికేషన్లో ప్రావీణ్యం సంపాదించారు. ఇప్పుడు ఆయన ప్రవర్తన చూస్తే విమర్శలు, ఒత్తిడులు, మీడియా దాడులు ఇవన్నీ సాధారణం చేసిన నేతగా కనిపిస్తున్నారు. ‘‘తక్షణ స్పందన – తర్కబద్ధ నిర్ణయం – ప్రజాభావనపై గౌరవం’’ అనే మూడింటి సమ్మేళనం ఇప్పుడు నారా లోకేష్లో కనపడుతోంది.
నేతగా భవిష్యత్ దిశ :
విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమైనవే. బడ్జెట్, ఉపాధ్యాయ నియామకాలు, విద్యా సంస్కరణలు.. ప్రతీ అంశాన్ని స్పష్టమైన విజన్తో ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేకాదు, పార్టీ పటిష్ఠతలోనూ లోకేష్ పాత్ర కీలకమవుతోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వాగ్దానాల అమలుపై పర్యవేక్షణ చేయడం, సోషల్ మీడియా ద్వారా ప్రజలతో నిత్యం టచ్లో ఉండటం వంటి అంశాలు ఆయనను మరింత దగ్గర చేస్తాయి.
లోకేష్ ఇప్పుడు సిస్టమ్ అర్థం చేసుకున్న, ప్రజా మనోభావాలు పసిగట్టగల నేత. ఆయన తరం యువతకు కూడా ప్రేరణ. ఆత్మవిశ్వాసం, ఆలోచనాత్మకత, సహనం.. ఇవన్నీ ఆయన నాయకత్వంలోని ముఖ్యమైన శక్తులు. ఇక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఇదే.
ముగింపు :
శ్రీకాకుళం ఘటనలో చూపిన మానవతా దృష్టి, వేలంగిని ఘటనలో చూపిన తక్షణ స్పందన.. ఇవి రెండూ కలిపి చూస్తే నారా లోకేష్ నాయకత్వంలో ఉన్న ‘‘పోలిటికల్ గ్రోత్’’ స్పష్టమవుతుంది. వీటిని చూసిన తరువాత ఎవరికైనా ఒక నిర్ణయం స్పష్టంగా వస్తుంది.. భవిష్యత్లో ఆంధ్రప్రదేశ్ను ముందుకు నడిపించగల సమర్థ యువ నాయకుడు నారా లోకేష్ తప్ప మరొకరు లేరు.
ఆయన తీరు, తీర్పు, తత్వం చూస్తే
‘‘నారా లోకేష్.. భవిష్యత్ ముఖ్యమంత్రిగా నోడౌట్!’’
జమ్ము సాయి కల్యాణ్,
పొలిటికల్ అనలిస్టు,
మేనేజింగ్ డైరెక్టర్,
జనస్వరం మీడియా.









