నష్టపోయిన రైతులను ఆదుకోవాలి పెడన నియోజకవర్గ జనసేన నాయకుడు సమ్మెట బాబు డిమాండ్‌

         పెడన  (జనస్వరం) :  పెడన నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల్లో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. నియోజవర్గంలో చాలా మంది రైతులు విత్తనాలు వెదజల్లారు. కొందరు రైతులు వరి ఆకు మడులు వేశారు. ఈనెల 14వ తేదీన కురిసిన భారీ వర్షాల వల్ల తర్వాత కురిసిన వర్షాల వల్ల వెదురు చల్లిన చేలు చెరువులుగా మారిపోయాయి. ఇప్పుడే మొలకలు వస్తున్న వరివిత్తనాలు కుళ్ళిపోతున్నాయి. వరి నారు పూర్తిగా దెబ్బతింది. అన్ని రకాలుగా నష్టపోయి రైతు కన్నీళ్లు పెడుతుంటే పెడన ఎమ్మెల్యే తమ అధినాయకుడు చిత్రపటానికి పాలాభిషేకాలు చేయించే పనిలో బిజీగా ఉన్నారు. వర్షం ఆగి నాలుగు రోజులు అవుతుంది. ఇప్పటికీ చేలలో నీళ్లు పోలేదు. దీనికి ప్రధానకారణం డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం. నియోజకవర్గంలోని ప్రధాన మురుగు కాలువలో ఏ ఒక్క కాలువలో కూడా గుప్పెడు మట్టి తీసిన పాపానపోలేదు. దొంగలు పడి ఇల్లంతా దోచుకుపోయిన తర్వాత ఇంటికి తాళం వేస్తున్నట్టు ఉంది వైసిపి ప్రభుత్వం పనితీరు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు తూతూ మంత్రంగా డైనేజీ పనులు ప్రారంభిస్తున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. పెడననయోజకవర్గంలో ఇరిగేషన్‌ అధికారులు, వ్యవసాయ అధికారులు నిద్రపోతున్నారా అని జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది. వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం ఎక్కువగా నష్టపోయింది బంటుమిల్లి మండలం నియోజకవర్గంలో 6078 ఎకరాలు పొలాల్లో పూర్తిగా నష్టం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే నష్టం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ధాన్యం డబ్బులు రాక ఇబ్బంది పడుతున్న రైతుకి ఈ వర్షాలు మరిన్ని కష్టాలు తెచ్చాయి. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టయింది. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగాయి. వైసిపి ప్రభుత్వం, సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలి. ఎకరానికి రూ. 5000/- నష్టపరిహారం అందించాలని జనసేన పార్టీ పెడన నియోజకవర్గం ఇంఛార్జ్  యస్.వి.బాబు సమ్మెట డిమాండ్‌ చేశారు.