రహదారుల మరమ్మతులను చేపట్టాలని జనసేన పార్టీ డిమాండ్

       డోన్, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కర్నూలు జిల్లా, డోన్ నియోజకవర్గం జనసేన నాయకులు బేతంచెర్ల మండలం నుండి మర్రికుంట గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారిని సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్రమహిళ సాధికారత ఛైర్మెన్ రేఖా గౌడ్ గారు మాట్లాడుతూ పబ్లిసిటీ కోసం కోట్లు కుమ్మరించే ఈ రాష్ట్ర ప్రభుత్వము రహదారులను మాత్రం పట్టించుకోవడంలేదని, అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. బేతంచెర్ల మండలం నుండి మర్రికుంట గ్రామానికి రహదారిపై రోజుకు వేలల్లో వాహనదారులు ప్రయాణం చేస్తారని ఇలాంటి రహదారి మరమ్మతులు చేయకుండా వదిలేయడం ఏమాత్రం సమంజసం కాదని, ఇప్పటికైనా ప్రభుత్వము మొద్దునిద్ర వీడి రహదారుల మరమ్మతులు చేపట్టాలని కోరారు. అలాగే డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రి గారు 07.07.2021 తేదీ నాడు శంకుస్థాపన చేసినా అధికారులు ఇప్పటి వరకు పనులను ప్రారంభము చేయకపోవడము దారుణము అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్రమహిళ సాధికారత ఛైర్మెన్ రేఖా గౌడ్ గారు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.