నిరుపేద అంధ మహిళా కుటుంబాన్ని ఆదుకోవాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ యుగంధర్ పొన్న డిమాండ్

                గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురు కుప్పం మండలం, మొండి వెంగన పల్లి పంచాయతీ, నెమళ్ళ గుంట గ్రామానికి చెందిన రాధిక అనే అంధ మహిళా కుటుంబానికి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం వర్తింప చేయలేదని జనసేన పార్టీ నియోజకవర్గం ఇంఛార్జ్ యుగంధర్ పొన్న ఆగ్రహం వ్యక్తం చేసారు. పుట్టుకతోనే అంధురాలు ఆదర్శ వివాహం చేసుకున్న కుమార స్వామి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇంత దయనీయమైన పరిస్థితిని పట్టించుకోక పోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. పెళ్లి కాకముందు 6 నెలలు దివ్యాంగుల పెన్షన్ తీసుకున్నారు. ఆ తరువాత 13 సంవత్సరాలు పెన్షన్ లేక ఈ నిరుపేద కుటుంబం దీనాతి దీనమైన అవస్థను అనుభవిస్తుంటే ఏ ప్రభుత్వమూ ఆదుకోక పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. వీరికి ఇళ్ల స్థలం ఇవ్వవలసిన అవసరం ఉందని, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఒక్క రోజులోనే ఇళ్ళు మంజూరు చేసి, మీరే స్వయంగా ఆ ఇంటిని పరిశీలించి ఇళ్ళు కట్టించే భాద్యతను తీసుకుని మీకున్న విచక్షణాధికారాన్ని వినియోగించమని, ఈ విషయంలో రాజకీయ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదని తెలియజేసారు. ఇప్పటికైనా ఈ నిరుపేద కుటుంబాన్ని పట్టించుకోక పోతే ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి సాయం కోరతానని తెలిపారు. ఈ సందర్బంగా రాధిక కుటుంబానికి కూరగాయలు వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మీడియా విభాగం ఇంఛార్జ్ వెంకటేష్, మండల ఉపాధ్యక్షులు సతీష్, నాయకులు వెంకటేష్, వీర మహిళలు మీనా  తదితురులు పాల్గొన్నారు.