గోదావరికి మళ్లీ వరద.. ముంపు భయంలో గిరిజనులు

గోదావరి

          గోదావరిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. వరద ప్రవాహంతో ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు ముంపు భయంతో బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో రెండు రోజులుగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలోనే భద్రాచలం వద్ద ఆరు అడుగుల మేర నీటి ప్రవాహం పెరిగింది. సోమవారం 26 అడుగులుగా ఉన్న నీటిమట్టం మంగళవారం సాయంత్రం నాటికి 32 అడుగులకు చేరింది. భద్రాచలం నుంచి దిగువకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలోని ఎద్దువాగు, గుండేటి వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎద్దువాగు పొంగడంతో వేలేరుపాడు మండలంలోని బోళ్లపల్లి, చిగురుమామిడి గ్రామాల మధ్య ఉన్న కాజ్‌వేపై వరద నీరు చేరింది. దీంతో కొయిదా, కట్కూరు, కాకిసనూరు, బోళ్లపల్లి, టేకూరు తదితర 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, దాచారం మధ్య గుండేటి వాగుపై ఉన్న కాజ్‌వే కూడా నీట మునిగింది. దీంతో బెస్తగూడెం, సీతారామపురం, నెమలిపేట, గుణ్ణంబోరు తదితర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఫలితంగా ఈ గ్రామాలకు వెళ్లాలంటే 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.

       మరోవైపు వరద నీటితో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం మూడు రోజులుగా వరద ముంపులో ఉంది. ధవళేశ్వరం వద్ద కాటన్‌ బ్యారేజీలో ఎనిమిది అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజీ 175 గేట్లను పైకిలేపి 3.8 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురవడంతో రానున్న 24 గంటల్లో మరింత ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. దేవీపట్నం కాఫర్‌ డ్యాం బ్యాక్‌ వాటర్‌ కారణంగా వరద నీరు వెనక్కి ఎగదన్నుతోంది. శనివారం నుంచి గండిపోశమ్మ ఆలయానికి రాకపోలు నిలిచిపోయాయి. వరద పెరగడంతో పాపికొండల విహార యాత్రకు వెళ్లే బోట్లను ఎక్కడిక్కడ ఒడ్డుకు నిలిపివేశారు. వరద పెరగడంతో దేవీపట్నం మండలం పలు గ్రామాల ప్రజలు కొండలు, గుట్టలపైకి చేరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

మహబూబ్‌నగర్‌
మహబూబ్‌నగర్‌ వేదికగా ఎన్నికల శంఖారావం
సచివాలయం
సచివాలయంలో ఆలయాలను ప్రారంభించిన గవర్నర్, కేసీఆర్‌
చంద్రబాబు
ఢిల్లీకి చంద్రబాబు.. వైసీపీ అలర్ట్, ఈసీకి పోటాపోటీగా ఫిర్యాదులు
ఎన్టీఆర్
శతజయంతి వేళ.. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల
హైకోర్టు
ఏపీ వక్ఫ్‌ బోర్డుకు ప్రత్యేకాధికారి నియామకం చెల్లదన్న హైకోర్టు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way