జిల్లా ఎస్పీకి, బాలాజీనగర్ పోలీసులకు ధన్యవాదాలు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 119వ రోజున 13వ డివిజన్ బాలాజీనగర్ లోని మారుతీ నగర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ 13వ డివిజన్ బాలాజీనగర్ లోని పలు ప్రాంతాల్లో చీకటి పడితే చాలు చైన్ స్నాచర్ల ఆగడాలు ఎక్కువవుతున్నాయని పవనన్న ప్రజాబాటలో మహిళల ద్వారా తమ దృష్టికి వచ్చిన అంశం పట్ల పోలీసులు స్పందించి ఈ ప్రాంతంలో భద్రతను పెంచడం మంచి పరిణామమని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున తాము ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నామని, ప్రజా సమస్యలను ప్రభుత్వం ముంగిట ఉంచుతున్నామని అన్నారు. చైన్ స్నాచర్ల అంశాన్ని తీవ్రంగా పరిగణించి తక్షణం స్పందించిన జిల్లా ఎస్పీ విజయారావు గారికి, బాలాజీనగర్ సీఐ మధుబాబు గారికి, తదితర పోలీసు సిబ్బందికి కేతంరెడ్డి వినోద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.