విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లాలో ఐదు దశాబ్ధాల చరిత్ర కలిగిన భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో దీనిపై ఆధారపడిన 20 వేల మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతోందని స్థానికులు మరియు శృంగవరపుకోట నియోజకవర్గం జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ, జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఆదుకుంటారా.. అమ్మేస్తారా! అని ప్రభుత్వాన్ని నిలదీశారు. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ భవితవ్యం ఆధునీకరించి వచ్చే సీజనుకు పూర్తి సేవలు అందిస్తామని హామీ ఇచ్చినా ఆ దిశగా చర్యలు కొరవడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక చెరకు రైతులకు ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. వచ్చే సీజన్ నాటికి ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని యాజమాన్యం చెబుతున్నప్పటికీ, చెరుకు రైతులకు నమ్మకం కలగడం లేదు. రానున్న సీజన్ లో చెరకు పంటను పండించాలా లేదా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. కనీస మద్ధతు ధర కరువవుతున్న పరిస్థితుల్లో అర్థంతరంగా ఫ్యాక్టరీని కూడా మూసివేయడంతో చెరకు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
