ప్రపంచ తెలుగు మహాసభలకి పల్నాడు యువసాహితీవేత్త కు సారథ్యం!
జాతీయ సమన్వయకర్తగా గుండాల రాకేష్ నియామకం.
నరసరావుపేట,మే 03( జనస్వరం)
తెలుగు భాషా, సాహిత్య వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్న అంతర్జాతీయ సాహిత్య సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు పల్నాడు జిల్లాకు చెందిన సాహితీ వేత్త గుండాల రాకేష్ ను జాతీయ సమన్వయకర్తగా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.తెలుగు భాషా పరిరక్షణ, సాహిత్య అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ఆయన చూపిన నైపుణ్యం, కృషిని గుర్తిస్తూ ఈ బాధ్యతలు అప్పగించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ మహాసభలు 2026 జూన్ 6 మరియు 7 తేదీలలో ఘనంగా నిర్వహించబడనున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రముఖ కవులు, రచయితలు, సాహితీవేత్తలు, మరియు తెలుగు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.ఈ సందర్భంగా గుండాల రాకేష్ మాట్లాడుతూ“ఈ బాధ్యత నాకు గౌరవంగా భావిస్తున్నానని, ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కి, జాతీయ అధ్యక్షులు ఈశ్వరి భూషణం కి,జాతీయ ప్రణాళిక అధికారి పార్థసారధి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, మహాసభలను విజయవంతంగా నిర్వహించేందుకు నా వంతు కృషి పూర్తి స్థాయిలో చేస్తానని తెలుగు భాషను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మా లక్ష్యం” అని తెలిపారు.
ఈ నియామకంపై పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. యువతకు ఇది ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.