తిరుపతి, నవంబర్ 23, జనస్వరం : తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తానని తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) అన్నారు. తిరుపతి లోని అకాడమీ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఛైర్మన్ మాట్లాడుతూ, తెలుగు మరియు సంస్కృత అకాడమీ కార్యాలయాలు తిరుపతి, విజయవాడలో నిరాఘటంగా కొనసాగుతాయన్నారు. అకాడమీ కార్యాలయం తొలిగిస్తామనే ప్రచారం నమ్మవద్దన్నారు. తిరుపతిలో సంస్కృత అకాడమీ అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇందుకు టీటీడీ సంస్థ సహకారం కోరతానన్నారు. ఢిల్లీలోని సంస్కృత అకాడమీ, తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ సహకారం తీసుకుంటామని చెప్పారు.
త్వరలో అకాడమీ ద్వారా మ్యాగజైన్ విడుదల :
త్వరలో అకాడమీ నేతృత్వంలో ఒక పత్రికను ప్రారంభించి, సాహిత్యం, మనోవైజ్ఞానికం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందేలా పత్రికను తీర్చిదిద్దుతామన్నారు. 9,10 షెడ్యూల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అకాడమీకి రావాల్సిన నిధుల గురించి తెలంగాణా ప్రభుత్వంతో చర్చ లు జరుపుతామన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అకాడమీకి నిధులు తేవడంలో విఫలం అయ్యిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో నిధులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. విజయవాడలో అకాడమీకి శాశ్వత భవన నిర్మాణం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ మేరకు రెండు ఎకరాల స్థలం కేటాయించాలిసిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థించామన్నారు.