అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తాం – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తాం – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

       నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అన్నం పెట్టే రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. బుధవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రైతులతో సమావేశమై వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఉయ్యూరులో కుళ్ళిన వరి కంకులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఉయ్యూరులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “నివర్ తుపాన్ వల్ల రైతాంగానికి జరిగిన నష్టం తెలుసుకోవడానికే క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నాను. రైతాంగానికి వెన్నుదన్నుగా ఉంటాం. వాళ్లలో గుండె నిబ్బరం నింపడానికే వచ్చాను. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తుతో రైతులు నష్టపోవడం బాధాకరం. అప్పుల పాలవుతున్న రైతులను మరింత కుంగదీసేలా నష్టాలు ఉన్నాయి. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది” అన్నారు.

గన్నవరం ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం 

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి హైదరాబాద్ నుంచి బయల్దేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉదయం 10 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘనంగా స్వాగతం పలికారు. కేసరపల్లి, ఉప్పులూరు, పునాదిపాడు మీదుగా కంకిపాడు క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. పెనమలూరు, గోసాల, పోరంకి నుంచి వేలాది మంది జనసైనికులు, అభిమానులు కంకిపాడు క్రాస్ రోడ్డుకు చేరుకొని జనసేనానిపై పూలవర్షం కురిపించారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు కదిలారు. ఎయిర్ పోర్టు నుంచి ఉయ్యూరు వరకు రహదారి అంతా జనంతో కిక్కిరిసిపోయింది. దారిపొడవునా కార్యకర్తలకు, అభిమానులకు జనసేన అధినేత అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.