నష్టపోయిన రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం – శ్రీ పవన్ కల్యాణ్ గారు…

నష్టపోయిన రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం – శ్రీ పవన్ కల్యాణ్ గారు…

                    నివర్ తుపాను, ఇతర ప్రకృతి విపత్తుల మూలంగా నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీన జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్  రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని పార్టీ నాయకులకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు పిలుపునిచ్చారు. కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించే ఈ కార్యక్రమంలో తానూ పాల్గొంటానని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశం అజెండాలో – నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో శ్రీ పవన్ కల్యాణ్ గారు పర్యటించి నష్టపోయిన రైతులను పరామర్శించిన క్రమంలో రైతాంగం పక్షాన నిలిచేందుకు చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణ,  పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం, తిరుపతి ఉప ఎన్నికల అంశం ఉన్నాయి. తుపాను కారణంగా పంటలు నష్టపోయి, అప్పుల పాలై మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడిన అంశాన్ని ఈ సందర్భంగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆత్మహత్య చేసుకున్న అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన శ్రీ ఓలేటి ఆదిశేషు, పర్చూరు నియోజకవర్గానికి చెందిన శ్రీ సాదినేని రమేష్ ల మృతి పట్ల శ్రీ పవన్ కల్యాణ్ గారు సంతాపం వ్యక్తం చేశారు. పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

                 అనంతరం శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “తుపాను వచ్చి అయిదు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా జనసేన పార్టీ తరఫున చేసిన ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్ మేరకు ఎకరాకు రూ. 35 వేల ఆర్ధిక సాయం, తక్షణ సాయంగా రూ. 10 వేలు అందించాలని కోరుతూ, రైతుల తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రక్రియలో భాగంగా ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. తుపాను కారణంగా 19 లక్షల ఎకరాలలో పంట దెబ్బ తిని దాదాపు 9 లక్షల మంది రైతులు నష్టపోయారు. అందులో ప్రభుత్వం ఇచ్చే కొద్దో గొప్పో చేయూత భూమి ఉన్న రైతుకి వెళ్తుంది గానీ, కౌలు రైతు పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. అందుకే జనసేన పార్టీ జై కిసాన్ కార్యక్రమానికి కౌలు రైతు కోసం.. భూమిని దున్నే రైతు కోసం అన్న నినాదాన్ని తీసుకున్నాం. పార్టీ తరఫున రైతాంగానికి అండగా ఉండే విధంగా నిరంతర ప్రక్రియగా చేపట్టే విధంగా ప్రధాన కార్యక్రమం జై కిసాన్.

రాష్ట్రంలో కనీస మౌలిక వసతులు కరవు

                               రాష్ట్రంలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. రహదారులు దారుణంగా ఉన్నాయి. నాలుగు జిల్లాల పర్యటనలో భాగంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యక్షంగా చూశాం. క్రియాశీలక సభ్యత్వం కీలకమైన అంశం. పార్టీ విధివిధానాలు, ఆలోచనా విధానం పట్ల కేడర్ కు అవగాహన కల్పించి వారిని రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది” అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని దివీస్ వివాదాన్ని పి.ఎ.సి. సభ్యుడు శ్రీ పంతం నానాజీ పార్టీ అధ్యక్షులు దృష్టికి తీసుకువచ్చారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పందిస్తూ “అభివృద్ధి కావాలి.. అదే సమయంలో కాలుష్యం అదుపులో ఉండాలి. దివీస్ అంశంపై తూర్పుగోదావరి జిల్లా నాయకులు సమగ్రమైన నివేదిక ఇవ్వాల”ని స్పష్టం చేశారు. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికపై ఉభయ పక్షాల ప్రతినిధులు కలసి చర్చించుకున్న తరవాత తుది నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. అప్పటి వరకూ ఈ అంశంపై ఎవరూ ఎటువంటి వ్యాఖ్యానాలు చేయవద్దని సూచించారు.

రైతు బీమా ఓ అంకెల గారడీ: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

                              పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ఈ ఏడాది మే నెల నుంచి నవంబర్ వరకు వాటిల్లిన వరుస ప్రకృతి వైపరీత్యాల కారణంగా చేతికి రావాల్సిన పంటను రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. ముఖ్యంగా నివర్ తుపాను కారణంగా జరిగిన నష్టం తాలూకు అంచనాలు ప్రతి వారం మారుతూ ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో అందుతున్న తాజా అంచనాల మేరకు 19.85 లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తింది. వేరుశనగ కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. శ్రీ పవన్ కల్యాణ్ గారి పర్యటనలో రైతులకు తక్షణం న్యాయం చేయాలని ఎకరాకి రూ.35 వేల పరిహారం, తక్షణ సాయం రూ.10 వేలు విడుదల చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది.  15వ తేదీకి నష్టం వివరాలు అంచనా వేసి, నెలాఖరుకు పరిహారం ఇస్తామని చెప్పడం మినహా క్షేత్ర స్థాయిలో అందుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన రైతు బీమా పథకం అంకెల గారడీగా కనబడుతోంది తప్ప రైతాంగానికి ధైర్యం నింపే విధంగా లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే క్రమంలో ఇప్పటికే అధ్యక్షుల వారి క్షేత్ర స్థాయి పర్యటన ముగిసిన వెంటనే అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆదేశాల మేరకు రైతులకు అండగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందించాలని నిర్ణయించడం జరిగింది” అన్నారు.

నష్టాల వివరాల సేకరణ లోపభూయిష్టం 

              సమావేశంలో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ టి.శివశంకర్ మాట్లాడుతూ “నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చేపట్టిన పర్యటన, రైతులకు అండగా ఉంటామని చెప్పడంతో రైతాంగానికి భరోసా కలిగింది” అన్నారు. పి.ఏ.సి. సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ బి.నాయకర్ మాట్లాడుతూ “క్షేత్ర స్థాయిలో చేపట్టిన పంట నష్టాల వివరాల సేకరణలో అనేక లోపాలు ఉన్నాయి. పంటల బీమా కూడా అర్హులకు దక్కే పరిస్థితి లేదు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే పరిహారం నమోదు చేస్తున్నారు” అన్నారు. రైతుల కోసం మండల స్థాయిలోను నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శ్రీ కందుల దుర్గేష్ సూచించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (పర్యావరణం) శ్రీ బొలిశెట్టి సత్య, పి.ఏ.సి. సభ్యులు  శ్రీమతి పాలవలస యశస్వి, శ్రీ కోన తాతారావు, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.