జనసేన పార్టీకి ఓటు బ్యాంకుని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా లెక్కలు వేసుకొని రాజకీయం చేయడం అనే ఆలోచన ఉండదు… ప్రజా సమస్యలపైనే మనం పోరాటం చేస్తాం కాబట్టే ప్రజలు మనపై నమ్మకాన్ని పెంచుకొంటున్నారు అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. అన్నం పెట్టే రైతులు నివర్ తుఫాను వల్ల సర్వం కోల్పోయారు… వాళ్ళకు అండగా నిలవడం అనేది మన ధర్మం కాబట్టే వారి తరఫున మాట్లాడటం జరిగింది అన్నారు. వారికి కలిగిన నష్టాన్ని హేతుబద్దంగా తెలిపి ఆ మేరకు రైతుల కోసం పరిహారం డిమాండ్ చేశాం… అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు అన్నారు. రైతలపట్ల బాధ్యతతో అండగా ఉండకపోతే రైతాంగానికి ద్రోహం చేసినట్లే అని తెలిపారు. ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చేందుకు ఛలో అసెంబ్లీకి సన్నడం అవ్వాలని చెప్పారు. వట్టి గొడ్డుకు అరుపులు ఎక్కువ… అలాగే వైసీపీ నాయకులకు నోరు ఎక్కువ…. 151 సీట్లు గెలిచినా ప్రజల కోసం ఆలోచించాలనే యోచన లేదు.. అలాంటివారికి ప్రజల సమస్యలు ఏమిటో రైతులకు కలిగిన నష్టం ఏమిటో బలంగా చెప్పుదాం అన్నారు. గురువారం సాయంత్రం తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ క్రియాశీలక సభ్యత్వం, జనసేన – బి.జె.పి. సంయుక్త కార్యక్రమాలు, నివర్ తుఫాను వల్ల కలిగిన పంట నష్టాలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఛలో అసెంబ్లీ కార్యక్రమంపై చర్చించారు. కరోనా పోరాట యోధులకు అభినందనలు తెలుపుతూ ఈ సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది. గిద్దలూరు ఎమ్మెల్యేని తన గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు అధికార పార్టీ నేతలు వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకున్న శ్రీ బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సమావేశంలో మౌనం పాటించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాలలోని పార్టీ శ్రేణుల అభిప్రాయాలూ, ప్రస్తుత పరిస్థితులతో కూడిన వివరాలతో నివేదికను డా.పి.హరిప్రసాద్, శ్రీ మనుక్రాంత్ రెడ్డి సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నియమించిన కమిటీ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయీ సమాచారంతో నివేదిక అందచేసింది. ఉప ఎన్నికలో అభ్యర్థి ఏ పార్టీ నుంచి అనే అంశంపై బీజేపీ అగ్ర నాయకత్వం మనతో దఫాదఫాలుగా చర్చలు చేస్తుంది. మరో విడత కీలక చర్చలు ఉన్నాయి. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఆ చర్చలు పూర్తయితే స్పష్టత వస్తుంది. ఒక వారంలో ఆ ప్రక్రియ పూర్తవుతుంది.
మానవత్వం అణచివేతకు గురి అయితే నేను ఉంటా :
నేను 2014లో శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసి, బీజేపీతో ప్రయాణం ప్రారంభించినప్పుడు నన్ను కలిసి అభినందించింది ఒక ముస్లిం మేధావి. బీజేపీతో కలసి ప్రయాణం చేయడం వల్ల మైనారిటీలు, క్రైస్తవుల దూరం అవుతారని నేను అనుకోవడం లేదు. నన్ను అభిమానించేవాళ్లు, జనసేన ఆలోచన విధానాన్ని మెచ్చుకొనే ముస్లింలు, క్రైస్తవులు గణనీయంగా ఉన్నారు. నాకు మతం కన్నా మానవత్వం ముఖ్యం. ఎక్కడ మానవత్వం అణచివేతకు గురవుతుందో అక్కడ నేను ఉంటాను. వారికి అండగా ఉంటాను. హిందూత్వం ఒక మతం కాదు. ఒక జీవన విధానం అని నేను నమ్ముతాను. మసీదులు, చర్చిలపై దాడులు జరిగినప్పుడు గుండెలు బాదుకుని, హిందూ ఆలయాల మీద దాడులు జరిగినప్పుడు మౌనంగా ఉండే కుహానా లౌకికవాదులను నేను వ్యతిరేకిస్తాను. రాములవారి ఆలయానికి, విగ్రహానికి నష్టం కలిగి, ధ్వంసం అయితే కచ్చితంగా స్పందిస్తాను. ఆ చర్యలను తప్పుబడతాను. అదే విధంగా మసీదుకో, చర్చికో అపచారం జరిగినా అదే విధంగా స్పందిస్తాను. హిందూ ఆలయాల ఆస్తులకు నష్టం కలిగితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు స్పందించేది తక్కువే. ఆయన దగ్గర ఉండే హిందూ మంత్రులు, నాయకులు మాత్రం దేవత విగ్రహాలు ధ్వంసం అయితే ఏమవుతుంది.. ఆంజనేయుడి చేయి విరిగితే ఏం నష్టం… రథం కాలితే కొత్త రథం ఇస్తాం అంటూ మాట్లాడతారు.
ప్రశ్నిస్తే వేధిస్తారా?
గిద్దలూరు నియోజకవర్గంలో మన పార్టీ కార్యకర్త శ్రీ వెంగయ్య నాయుడు తన ఊరి సమస్యలు తీర్చమని ఎమ్మెల్యేని అడిగి కారు దిగి చూడమన్నారు. తన గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు వేధింపులకు గురి చేశారు. ఆ ఒత్తిడితోనే శ్రీ వెంగయ్య నాయుడు ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నారు. మన పార్టీకి బలం నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలే. వారిపట్ల పి.ఏ.సి. సభ్యులు, ఇతర నాయకులు… అందరం ప్రేమతో వారిని అదరిద్దాం. పార్టీ సిద్ధాంతాలతో అనుసంధానమై ఉన్నారు. క్రియాశీలక సభ్యత్వం నమోదు అనే ప్రక్రియ మన పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళ్తుంది. మన బలమైన కార్యకర్తల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే క్రియాశీలక సభ్యత్వ ప్రక్రియకు రూపకల్పన చేశాం” అన్నారు.
వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి :
రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “పి.ఏ.సి.లో సభ్యులుగా ఉన్నవారు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో బాధ్యతలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడ పార్టీ కార్యక్రమం చేపట్టినా బాధ్యతలు పంచుకోవాలి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు విభిన్న పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మన పార్టీ నేతలు సమన్వయంతో వ్యవహరిస్తూ ముందుకువెళ్తున్నారు. దివిస్ సమస్యపై తూర్పుగోదావరి జిల్లా నాయకులు అంతా కలసికట్టుగా వచ్చారు. అక్కడ మనం చేసిన పోరాటం ప్రజల్లోకి వెళ్లింది. నివర్ తుఫాను పర్యటన సమయంలోనూ వివిధ జిల్లాల్లో సమన్వయంతో పనిచేశారు. రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ గతేడాది నిలిచింది. ఇందుకు మనం సన్నద్ధం కావాలి” అన్నారు.
బీజేపీ జి.హెచ్.ఎం.సి. ఎన్నికల స్థాయిలో పోరాడుతుందా?: పి.ఏ.సి. సభ్యులు :
ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సాగిన చర్చలో పి.ఏ.సి.సభ్యులు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై పలు అంశాలు లేవనెత్తి సూచనలు చేశారు. ఈ స్థానంలో మన పార్టీకి బలం ఉంది… గత ఎన్నికల గణాంకాలను పరిశీలించినా ఆ విషయం తెలుస్తుంది… ఇప్పుడు ఆ బలం మరింత పెరిగింది… క్షేత్ర స్థాయిలో కూడా మనం బలంగా ఉన్నాం అని చెప్పారు. ‘ఈ స్థానంలో బి.జె.పి. తమ అభ్యర్థిని నిలిపే పక్షంలో ఆ పార్టీ తిరుపతి ఉప ఎన్నికను జి.హెచ్.ఎం.సి. ఎన్నికలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతుందా? ఆ విధంగా పోరాడాలనే విషయాన్ని జాతీయ నాయకత్వానికి మనం స్పష్టం చేయాలి. జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఆ దిశగా పని చేయాలి. జాతీయ నాయకులు, ముఖ్యులు ఇక్కడ ప్రచారం చేయాలి. అప్పుడు మనమంతా వెన్నంటి ఉందాం’ అని సభ్యులు చెప్పారు. మన అభ్యర్థి బరిలో ఉంటే తప్పని సరిగా బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఈ పార్లమెంట్ స్థానంలో బాధ్యతలు తీసుకొని ప్రచారం, పర్యటనలు చేయాలని సభ్యులు సూచించారు. ఇప్పటికే జిహెచ్ఎంసి వదులుకున్నాము… తిరుపతి వదులుకునే పక్షంలో తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బిజెపి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించాలి… ఆ మేరకు బిజెపి అగ్రనాయకులు ప్రకటన ఇవ్వాలి అని పి. ఏ.సి. సభ్యులు అభిప్రాయపడ్డారు. పార్టీ అధ్యక్షులపట్ల బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు అమిత గౌరవం ఇస్తుండటం సంతోషకరం అని సభ్యులు తెలిపారు. అదే క్రమంలో జిల్లాల్లోని ఆ పార్టీ నాయకులు సమన్వయపరచుకోవడం లేదని ప్రస్తావించారు.
కరోనా పోరాట యోధులకు అభినందనలు :
కరోనా విపత్తు తలెత్తినప్పుడు వైద్య, నర్సింగ్, పారా మెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది ఎంతో ధైర్యంతో చేసిన సేవలు వెలకట్టలేనివి అని పి.ఏ.సి. సమావేశం అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. పోలీసులు, పాత్రికేయులు చేసిన సేవలను ప్రశంసించింది. కరోనా వ్యాక్సిన్ సిద్ధం చేసిన శాస్త్రవేత్తలకు అభినందలు తెలిపింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్, శ్రీ కోన తాతారావు, శ్రీమతి పాలవలస యశస్వి, శ్రీ పంతం నానాజీ, శ్రీ బి. శ్రీనివాస యాదవ్, శ్రీ బి. నాయకర్, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ ముత్తా శశిధర్, శ్రీ మనుక్రాంత రెడ్డి, శ్రీ కందుల దుర్గేశ్, శ్రీ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.