
త్రాళ్ళ పొద్దుటూరు ను తక్షణమే రక్షించాలి : పవన్ కళ్యాణ్
జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రిజర్వాయర్ ముంపు పరిధిలో ఉన్న తాళ్ళప్రొద్దుటూరు గ్రామస్తులను వరదనీటి నుంచి కాపాడడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలి. తమ కాలనీలోకి రిజర్వాయర్ నీరు వస్తోందని, తమను కాపాడాలని ఎస్.సి.కాలనీ వాసులు చేసిన విజ్ఞప్తిని జనసేన ప్రధానకార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్య గారు నా దృష్టికి తీసుకువచ్చారు. కాలనీవాసులు అందించిన వివరాలను పరిశిలించాను. జనసేన స్థానిక నాయకులను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపాను. అక్కడి పరిస్థితి దయనీయంగా ఉందని వారు వివరాలు అందచేశారు. తమకు ఇంకా పరిహారం కూడా అందనందున తాము ఇక్కడే ఉండిపోయామని కాలనీవాసులు చెబుతున్నారు. వేరేచోట ఇల్లు అద్దెకు తీసుకునే ఆర్థిక స్టోమత వారికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఎక్కడికి వెళతారు? వృద్దులు, చంటి పిల్లలు, చివరికి గర్భిణీలు సైతం వరద నీరు ఎప్పుడు ముంచేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇది చాల అమానుషం. ప్రస్తుతం రిజర్వాయర్లో 15 టి.ఎం.సి.ల నీరు చేరుకుంటేనే ఎస్.సి. కాలనీలోకి వరద నీరు వచ్చింది. పూర్తి స్థాయి నీటీ మట్టం ఉంటే పరిస్థితి వూహించడం కష్టంగా వుంది. అందువల్ల చివరి కుటుంబం సైతం తాళ్ళప్రొద్దుటూరు విడిచే వరకు గ్రామస్తుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. రిజర్వాయర్ లోకి నీటి విడుదలపై సంయమనం పాటించాలి. నిర్వాసితులను పలహసతో కాకుండా వారు ఇష్టపూర్వకంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. నిర్వాసితులతో అధికారులు తక్షణం సంప్రదింపులు జరిపి వారి అభిష్టాన్ని నెరవర్చాలి. తాళ్ళప్రొద్దుటూరు వాసుల ప్రాణాలు రక్షించమని కోరుతున్నాను అని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరారు.