దళిత కమిషనర్‌ని బదిలీ చేయడం అన్యాయం : విశాఖ జనసేన కార్పొరేటర్లు

     విశాఖపట్నం, (జనస్వరం) : జీవిఎంసిలో నిజాయితీగా పనిచేస్తున్న దళిత కమిషనర్‌ లక్ష్మీ (ఐ ఏ ఎస్‌) రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా బదిలీ చేసిందని జనసేన కార్పొరేటర్లు మండిపడ్డారు. గురువారం జనసేన ఫ్లోర్‌ లీడర్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో 22 వార్డు కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ మాట్లాడుతూ వైసిపి విశాఖ ఎంపీ హై గ్రీవ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకపోవడం, రుషి కొండ టూరిజం ప్రాజెక్టు నిర్మాణాలకు అనుమతులు నిరాకరించడంతోనే కమిషనర్ ని బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. వైసిపి పార్టీకి ఎన్నికల నిధి విశాఖ ఎంపీ సత్యనారాయణ 9 కోట్లు ఇచ్చారని, హై గ్రీవ కోటిన్నర పార్టీ ఫండ్‌ ఇవ్వడంతోనే వారికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబట్టడం ఎంతవరకు సమంజసం అని ముత్యాలు ప్రశ్నించారు. ఎంత పెద్ద జీవీఎంసీ కి కన్ఫర్మ్‌ ఐఏఎస్‌ అధికారిని నియమి౦చడం సరైందికాదన్నారు. జివిఎంసిలో నలుగురు షాడో మేయర్లుగా తయారై జీవీఎంసీ నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దోచుకోవడం, దండుకోవడం అలవాటుగా మారిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భీశెట్టి వసంత లక్ష్మి, దల్లి గోవింద రెడ్డి పాల్గొన్నారు.