
ఆముదాలవలస, (జనస్వరం) : వైసిపి ప్రభుత్వం నేడు ఆమదాలవలస నియోజకవర్గంలో చేపడుతున్న బస్సు యాత్రపై జనసేన పార్టీ ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ వైసిపి నేతల స్వార్థానికి ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఈ యాత్రలను చేపడుతున్నారని విమర్శించారు. శాసనసభాపతి అయిన స్థానిక ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఆముదాలవలస పట్టణంలోని ప్రధాన రహదారిని దిగ్బంధం చేసి నిత్యం రాకపోకలు సాగించే ప్రజలకు వ్యాపార సంబంధీకులకు ముఖ్యంగా వృద్ధులకు మహిళలకు విద్యార్థులకు సైతం వేధిస్తూ ఈ బస్సు యాత్రను చేపడుతున్నారని అన్నారు. “రోడ్లు వేయడం చేతకాదు గాని బస్సు యాత్రలు చేస్తారా” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అవినీతి అక్రమాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, సమస్యలపై గొంతు ఎత్తిన ప్రతిపక్షాలపై అరెస్టులు అక్రమ కేసులు పెట్టడమే పనిగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఇప్పటికే ప్రజలు ఈ ప్రభుత్వం అవినీతి పాలనతో విసిగిపోయారని, అతి కొద్ది నెలలలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం స్థాపనకై ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆముదలవలస నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయని ధీమా వ్యక్తం చేశారు.