నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 262వ రోజున 54వ డివిజన్లో వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో జరగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీకి పేదల ఇళ్ళను కూలగొట్టడం అలవాటుగా మారిందన్నారు. మైపాడు గేటు ప్రాంతంలో పేదలకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్ళు పగలగొట్టిన తరహాలోనే భగత్ సింగ్ కాలనీలో పేదల ఇళ్ళకు మార్కింగ్ వేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఒకవైపు సీఎం జగన్ రెడ్డి గారు జగనన్న కాలనీలు అంటూ ప్రకటనలు ఊదరగొడుతుంటే ఇక్కడ వాస్తవంలో ఒక్కరికి కూడా లబ్ధి చేకూరలేదని అన్నారు. నాలుక గీసుకునే దానికి కూడా పనికిరాని బులుగు పచ్చ కాగితాలు ఇచ్చి ఇవే ఇళ్ళ పట్టాలు అంటూ వైసీపీ నేతలు, వాలంటీర్లు చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. పరిపాలన చేత కాని పరిస్థితులకు ఇది నిదర్శనం అన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్ళ జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, పేదలకు అండగా నిలబడుతామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు