
విజయనగరం ( జనస్వరం ) : మహాత్మ జ్యోతిరావు ఫూలే జీవితం అందరికీ ఆదర్శమని జనసేన నాయకులు గురాన అయ్యలు పేర్కొన్నారు.. స్థానిక జీ.ఎస్.ఆర్ హోటల్ సమావేశ మందిరంలో జనసేన ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ దేశంలో కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన తొలి వ్యక్తి ఫూలే అని కొనియాడారు. శతాబ్దాల నాడే అణగారిన వర్గాల కోసం, స్త్రీ విద్య కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్లిన జ్యోతిరావు ఫూలే చూపిన మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు. జ్యోతిబా పూలే ప్రజల హృదయాల్లో నేటికీ నిలిచి ఉన్నారని కొనియాడారు. వారి ఆశయాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. సమన్యాయ సత్యశోధకులైన మహాత్మా ఫూలే చెప్పిన మాటలను వల్లె వేయడం కాకుండా వాటిని ఆచరించి చూపించడం జనసేన పార్టీ విధివిధానాల్లో భాగమని తెలియజేశారు. జన సేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచనా విధానం.. పూలే ఆలోచనలకు దగ్గరగా ఉండే సూత్రమన్నారు. ఆ మహనీయుని అడుగు జాడల్లో జనసేన ప్రస్థానం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రవితేజ, త్యాడ రామకృష్ణారావు(బాలు), ఎంటి రాజేష్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, ఎమ్. పవన్ కుమార్, అప్పలనాయుడు, భార్గవ్, చందూ, సురేష్, హిమంత్ తదితరులు పాల్గొన్నారు.