పిఠాపురం, ఫిబ్రవరి 5, (జనస్వరం) : త్వరలో “గుడ్ మార్నింగ్ పిఠాపురం” అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. గురువారం పిఠాపురం పట్టణంలోని రామ టాకీస్ వద్ద పిఠాపురం టౌన్ అధ్యక్షురాలు డా.చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పిఠాపురం అభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలో ప్రతి వార్డులో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రతి వార్డు ఇంచార్జ్, బూత్ ఇంచార్జ్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలతో నేరుగా ముఖాముఖి సంభాషణల ద్వారా వార్డుల్లోని పారిశుధ్య పరిస్థితులు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల లోపాలపై సమాచారం సేకరించి, తక్షణ పరిష్కారాల కోసం చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రజల దగ్గర నుంచే తెలుసుకుని పరిష్కరించే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఫైమన్ కమిటీ సభ్యులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఎవరికి ఏ సమస్య వచ్చినా కమిటీ సభ్యులను నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫైమన్ కమిటీ పిఠాపురం అభివృద్ధి, పార్టీ ఆశయాల అమలుకు నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో పట్టణం, మండలం, గొల్లప్రోలు, యూ.కొత్తపల్లి మండలాల్లో వార్డు ఇంచార్జ్లు, మండల అధ్యక్షుల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ‘మెంబర్ టు లీడర్’ భావనను పిఠాపురం నుంచే ప్రారంభించడం ఆనందకరమని అన్నారు. ఈ సమావేశంలో పిఠాపురం పట్టణ ఉపాధ్యక్షులు బాలేపల్లి అనిల్, పిఠాపురం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ చెల్లుబోయిన నాగేశ్వరరావు, పిఠాపురం ఆస్పత్రి డైరెక్టర్ బజ్జకుమార్, చెల్లుబోయిన సతీష్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కొత్తపల్లి బుజ్జి, కొత్తం సుందర్, ఆగంటి ప్రభాకర్, కూరాకుల అరవింద్, కోలా అరవింద్, బొజ్జ లోవరాజు, మార్నిడి రంగబాబు, పట్టణంలోని వార్డు మరియు బూత్ ఇంచార్జ్లు పాల్గొన్నారు.