అనంతపురం, ఫిబ్రవరి 08, పెన్నా టైమ్స్ : అనంతపురం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకుల మాధవ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, మేధావులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్నెపాకుల మాధవ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమితి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రైతులకు జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావిస్తూ రైతు భరోసా పెంపు, ఇన్పుట్ సబ్సిడీలు, పంటలకు గిట్టుబాటు ధరలు, ఉచిత బోర్లు, భూమిలేని రైతులకు మూడు ఎకరాల భూమి కేటాయింపు వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులు, పేద విద్యార్థులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాలు మౌనం వీడాలని కోరారు. 2018లో స్థాపితమైన ఈ సమితి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు రామకృష్ణ నిర్వహించగా, ఎస్సీ జన సంఘం అధ్యక్షులు దాసిగానిపల్లి కుల్లాయప్ప, బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు, ఫైట్ ఫర్ రైట్స్ అధ్యక్షులు కేపీ రాజు, ఐఎంఎం ఆర్గనైజేషన్ అధ్యక్షులు మహబూబ్ బాషా, బీసీ సంఘం అధ్యక్షులు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.