
విజయనగరం, అక్టోబర్ 28, (జనస్వరం): నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పూసపాటిరేగ మండలంలోని ‘స్వర్గధామం’ ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవకతవకలపై సీరియస్గా స్పందించారు. స్థానిక సర్పంచులు చేసిన ఫిర్యాదుల మేరకు విచారణకు ఆదేశిస్తూ, అక్టోబర్ 30న జరగాల్సిన ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎంపీడీఓకు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.60.57 లక్షల మండల ప్రజాపరిషత్ నిధులను స్వర్గధామం నిర్మాణానికి వినియోగించడం అనేది తీవ్రంగా తప్పు చర్య అని వ్యాఖ్యానించారు. కేవలం రూ.5 నుంచి 10 లక్షల ఖర్చుతో పూర్తి చేయదగిన ప్రాజెక్టుకు ఇంత భారీ మొత్తాన్ని మంజూరు చేయడం దుర్వినియోగమని ఆమె స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులను ఇలాంటి ప్రాజెక్టులకు మళ్ళించడం సరికాదని ఆమె పేర్కొన్నారు. “ప్రజల అవసరాల కోసం ఉండే సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి పనులకు ఈ నిధులను వాడాలి. కానీ అవి అధికార పార్టీ నేతల స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం అవుతున్నాయి,” అని విమర్శించారు. రుషికొండ ప్యాలెస్ ప్రాజెక్టుతో పోలుస్తూ ఆమె మాట్లాడుతూ, “ఇది రాష్ట్రంలో జరిగిన అవినీతికి మరో ఉదాహరణ. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.500 కోట్లతో ప్రజాధనాన్ని వృథా చేసి రుషికొండ ప్యాలెస్ కట్టారు. ఇప్పుడు అదే విధంగా పూసపాటిరేగలో కూడా ప్రజా నిధులను దోచుకుంటున్నారు,” అని మండిపడ్డారు. సర్పంచుల ఫిర్యాదుల ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరపాలని, విచారణ పూర్తయ్యే వరకు స్వర్గధామం ప్రారంభోత్సవం మరియు పనులను నిలిపివేయాలని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆదేశించారు.