
ఆంధ్రుల జీవనాడిగా పిలవబడే పోలవరం ప్రాజెక్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో మరోసారి పునర్జీవం పోసుకుంది. 2019–2024 మధ్యకాలంలో అప్పటి అసమర్థ ప్రభుత్వం చేతకానితనం వల్ల పోలవరం ప్రాజెక్టును వరదల్లో ముంచేశారు. ఐదేళ్లల్లో ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు, సాంకేతిక లోపాల వంటి సమస్యల గుర్తించి పరిష్కరిస్తూ ఈ 16 నెలల్లోనే ప్రాజెక్ట్ పనులను 85 శాతానికి తీసుకెళ్లి పూర్తి చేసింది. రూ.1900 కోట్లు ఆదివాసీ గిరిజనులకు వారి ఖాతాల్లో జమ చేసింది. 2024 లో సీఎంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఏడాదిలో మూడు సార్లు ప్రాజెక్ట్ను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ప్రతి విభాగంపై లోతుగా సమీక్ష నిర్వహించారు. స్పష్టమైన టైమ్లైన్, పనుల వారీగా షెడ్యూల్ విడుదల చేశారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయాలనే డెడ్లైన్ పెట్టారు.
రికార్డ్ స్థాయిలో పనులు :
2014-2019 మధ్య కాలంలో శరవేగంగా సాగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 72 శాతం పనులు పూర్తి చేసుకుంది. రూ.11,762.47 కోట్లు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసింది. ముంపు కాలనీల కోసం ఆర్ అండ్ ఆర్ కు రూ.4,144 కోట్లు ఖర్చు చేసింది. 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాల నదిని డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ నిర్మించాం. 100 మీ. డెప్త్ ఉండే డయాఫ్రమ్ వాల్ నిర్మించాం. 20 మీ. ఎత్తు, 15 మీటర్ల వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు అమర్చాం. 354 కిలోమీటర్ల పొడవున్న కుడి, ఎడమ కాలవలు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కుడి కాలువ పూర్తి చేశాం. ఎడమ కాలువ పనులు దశలవారిగా జరుగుతున్నాయి. 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించాం. ఏ ప్రాజెక్టులోను నిర్వహించని కాంక్రీట్ పనులు పోలవరంలో చేపట్టారు.
పోలవరానికి ఆది నుంచి అడ్డుపడుతున్న అబ్బా – కొడుకులు :
జలయజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టులను వైఎస్ఆర్ ధనయజ్ఞంలా మార్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2004లో స్పిల్ వేకు మధుకాన్, శీనయ్య కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. కేవలం కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా 2009లో మధుకాన్ సంస్థకు అప్పగించిన పనులు రద్దు చేశారు. హెడ్ వర్క్స్ ను నిర్లక్ష్యం చేసి కమిషన్లు వచ్చే కాలువల పనులపై దృష్టి పెట్టారు. వైఎస్ఆర్ హయాంలో ఖర్చు చేసింది రూ.423 కోట్లు మాత్రమే. 2004 నుంచి 2014 వరకు పనుల్లో 5 శాతం పురోగతి మాత్రమే సాధించింది. రైతులకు పరిహారం ఇవ్వలేదు. అలాగే 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ కొత్త కాంట్రాక్టర్ ను మార్చడం వల్ల 15 నెలలకు పైగా పనులు నిలిచిపోయాయి. ప్రమాణ స్వీకారం చేసిన రోజే పనులు నిలిపివేశాడు. కాంట్రాక్టర్ ను వెళ్లగొట్టాడు. కాఫర్ డ్యాంలలో గ్యాప్ లు పూర్తి చేయకపోవడం వల్ల 2020 సెప్టెంబర్ లో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. నీతి ఆయోగ్ నియమించిన ఐఐటీ హైదరాబాద్ కూడా జగన్ తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని స్పష్టం చేసింది. జగన్ అసమర్థత కారణంగా గైడ్బండ్ కుంగిపోయింది. రూ.80 కోట్లతో నిర్మించిన ఈ గైడ్బండ్ నిరుపయోగంగా మారింది. 2014లో ముంపునకు గురయ్యే ఏడు మండలాలను కలిపాకే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అదే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేదని చేతులు దులుపుకున్నారు. ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన రూ.3,385 కోట్లనూ జగన్ దారి మళ్లించారు. నిర్వాసితులకు ఇస్తానని ఎకరాకు రూ.15 లక్షలు, అదనంగా చెల్లిస్తానన్న రూ.5 లక్షలు కూడా చెల్లించలేదు. రివర్స్ టెండర్ విధానంలో రూ.600 కోట్లకు పైగా ఆదా చేశామన్న జగన్... ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి రూ.25 వేల కోట్ల మేర నష్టాన్ని తీసుకొచ్చారు. నదుల అనుసంధానానికి పోలవరం గుండెలాంటిది. అలాంటి ప్రాజెక్టుకు జగన్ శాపంలా మారారు. పోలవరం నిర్మాణంలో జాప్యం కారణంగా రైతులకు రూ.45,000 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. సవరించిన రూ.55,548 కోట్ల అంచనా వ్యయం మరో 33 శాతం పెరిగింది. దీనికంతటికి జగన్ దోపిడీ విధానం, అసమర్థతలే కారణం.
పోలవరం కల సాకారం దిశగా :
2027 డిసెంబర్ నాటికి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. పోలవరం కుడి, ఎడమ కాలువల పనులతో పాటు నూతన డయాఫ్రం వాల్ నిర్మాణం, పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాస కాలనీల నిర్మాణం వంటి పనులు చకచక సాగుతున్నాయి. ఏపీ బడ్జెట్ లో పోలవరంకు రూ.6,705 కోట్లు కేటాయించి పనులు చేస్తున్నాం. ఆదివాసీ నిర్వాసిత గిరిజనులకు సహాయ పునరావాసం, భూసేకరణ పనులు 2019 నాటికి 18.66 శాతం జరుగగా.. జగన్ ఐదేళ్ల పాలనలో 3.89 శాతమే జరిగింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వచ్చిన ఏడాది కాలంలోనే.. 2.56 శాతం మేర భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల పనులు 25.11 శాతానికి చేరాయి. ఏడాదిలోనే ప్రాజెక్టు మొత్తం ప్రగతి 6.96 శాతం పెరిగి. 56.75 శాతానికి చేరింది. రూ.990 కోట్ల వ్యయంతో 1.396 కిలోమీటర్ల పొడవైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం 2025 జనవరిలో ప్రారంభమైంది. ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయ్యాయి. గైడ్ వాల్ కాంక్రీట్ పనులు 2024 నవంబర్లో మొదలయ్యాయి. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల నిర్మాణం వేగవంతమైంది. సీపేజీ నివారణకు బట్రెస్ డ్యామ్ నిర్మాణానికి కేంద్ర జలసంఘం 2025 ఏప్రిల్లో ఆమోదం తెలిపింది. ఐదేళ్ల విరామం తర్వాత, ఎడమ కాలువ పనులు 2025లో ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. సుమారు రూ.1200 కోట్లతో 8 దశలో పనులు జరుగుతున్నాయి. చంద్రబాబు కేంద్రంతో సమన్వయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12,157 కోట్ల అడ్వాన్స్ నిధులను సమకూర్చారు. 2025 మార్చి నాటికి రూ.5,512 కోట్లు విడుదలయ్యాయి. ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికం. రూ.30,436.95 కోట్లతో కొత్త డీపీఆర్కు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.6,270 కోట్లతో ఆదివాసి గిరిజన నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీలు విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2025 జనవరిలో రూ.900 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశాం. తాజాగా రూ.1000 కోట్లు ఆదివాసి గిరిజనుల ఖాతాల్లోనే నేరుగా జమ చేశాం. ఇలా ఇప్పటివరకు కేవలం రూ.2,600 కోట్లు ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన ఆదివాసి గిరిజన కుటుంబాలకు అందజేశాం.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 2.91 లక్షల హెక్టార్లలో పంట సాగు, 540 గ్రామాలకు తాగునీరు, 28.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. సీఎం చంద్రబాబు దృష్టిలో పోలవరం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్ట్ కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలిచే ఒక జీవనాడి. ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. రాష్ట్రాన్ని కరువురహితంగా మార్చవచ్చు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశలో ఒక భగీరథ యత్నంగా పోలవరం నిలుస్తోంది.
- ప్రవీణ్ బోయ, అనలిస్టు