బుక్కపట్నం, అక్టోబర్ 20, (జనస్వరం) : సత్య సాయి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా ఈరోజు బుక్కపట్నం డైట్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు రూపొందించిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించబడ్డాయి. ఈ ప్రదర్శనలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 గ్రూప్ ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలకు ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులకు నాయకుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని ప్రతిబింబించే విధంగా ఈ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ మాట్లాడుతూ, ఇటువంటి ప్రయోగాత్మక వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా పిల్లల్లో నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. భట్టిపట్టే చదువులకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పరిశోధనల వైపు విద్యార్థులు దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. అలాగే కళాశాలలు, విద్యాసంస్థలు పిల్లల ప్రయోగశాలలుగా మారితే దేశ అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ తరహా కార్యక్రమాలు భవిష్యత్ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే దిశగా ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి చైర్మన్లు, డైరెక్టర్లు, సత్య సాయి జిల్లా వివిధ నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ చైర్మన్లు, కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.