హిందూపురం, సెప్టెంబర్ 10 (జనస్వరం): శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని ఎస్. సడ్లపల్లి గ్రామం 13వ వార్డు సచివాలయాన్ని రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ దాలవాటం మణిప్రియ సందర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయానికి వచ్చిన ప్రజలను ఆమె ఆత్మీయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడి, అర్హులైన ప్రజలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా, ఎవరూ అవకాశాన్ని కోల్పోకుండా ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరయ్యే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. “అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరాలి.. ప్రతి అర్హుడికి పెన్షన్ అందాలి” అనే లక్ష్యంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మణిప్రియ పేర్కొన్నారు.