ప్రమాద బీమా పత్రాలను శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందించిన బీమా సంస్థ ప్రతినిధులు...
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల కోసం ఉద్దేశించిన ప్రమాద బీమాకు సంబంధించిన పత్రాలను యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ సంస్థ ప్రతినిధులు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందచేశారు. సోమవారం హైదరాబాద్ లో ఆ సంస్థ ప్రతినిధులు బీమా వివరాలను తెలిపారు. కార్యకర్తల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమంలో బీమా సంస్థ నుంచి సంపూర్ణ సహకారం అవసరమని శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ సంస్థ సీనియర్ డివిజినల్ మేనేజర్ శ్రీ సి.సురేష్ లాల్, ప్రొవిడెన్స్ ఇండియా ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ సంస్థ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ యడ్ల వెంకట నరసింహరావు బీమాకు సంబంధించిన పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
జనసేన పార్టీ తొలి విడతలో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. రెండో విడతగా సోమవారం నుంచి 32 నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమాను కల్పించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రతి క్రియాశీలక కార్యకర్తకు వ్యక్తిగతంగా రూ.5 లక్షల ప్రమాద బీమాను, రూ.50 వేల ఆరోగ్య బీమాను కల్పిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ వైద్యపరమైన సేవలు పొందినా ఆరోగ్య బీమా వర్తింపచేస్తారు. కార్యకర్తలకు బీమా విషయంలో ఎప్పుడూ అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, జిల్లాల్లోనూ తగిన సమాచారం అందించి, సహాయపడేలా తగిన చర్యలు తీసుకోవాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు పార్టీ నాయకులను ఆదేశించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యులు శ్రీ బి.మహేందర్ రెడ్డి, శ్రీ ఎ.వి.రత్నం, శ్రీ ఈవన సాంబశివ ప్రతాప్ పాల్గొన్నారు.