పుట్టపర్తి, ఏప్రిల్ 25 (జనస్వరం) : రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, పుట్టపర్తి వద్ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 పై సమావేశం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహణ బాధ్యతలు చూసిన ఆర్డీఓ సువర్ణకు నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను వివరించారు. కొత్తచెరువు ప్రాంతంలోని సత్యసాయి వాటర్ పైప్లైన్, దర్గా డ్రైనేజీ సమస్య, కొత్తచెరువు నుండి పెనుగొండ ప్రధాన రహదారి పరిస్థితి వంటి అంశాలను ప్రస్తావిస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా సమావేశంలో ప్రస్తావించగా, వాటిపై తగిన చర్యలు తీసుకునేలా అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు.