Search
Close this search box.
Search
Close this search box.

“ వ్యవస్థ కోసం ప్రణాళిక ”

                              సామాజిక రుగ్మతలతో పోరాడాలనుకునే ఒక ప్రణాళిక, ఆ ప్రణాళికను నెరవేర్చే తీరులో జరిగే అలసట, వాటి సమూల ప్రక్షాళనను చేపట్టడంలో ఉండే దీక్ష, ఒక రాజకీయ పార్టీకి అపాదించగలమా అనే భావన కలిగినప్పుడు మనసు ఎంత నిరుత్సాహ పడుతోందో అవగాహన ఉన్న ప్రతీ వ్యక్తికి తెలుస్తుంది. ఉద్దేశ్యం వెనుకగల సంకల్పం ఎంత బలమైనదై ఉండాలో కూడా లోతులలోకి వెళ్ళి ఒకసారి మనల్ని మనం విమర్శించుకుంటే తెలుస్తుంది. ఎన్నో రాజకీయ పార్టీల ఉనికి పోరులో సిద్ధాంతాలు ఆటకెక్కి పోతున్న ఈ రోజుల్లో సిద్ధాంతమే ముఖ్యం, గెలుపు సిద్ధాంతానికే గాని పార్టీకి కాదనే భావజాలం కలిగిన పార్టీ ఏదైనా ఉందా అంటే చెప్పగలరా ఎవరైనా..!!?? మరొకరు చెప్పినా ఒప్పుకోగలరా..?? ఎందుకంటే పూర్తిగా రాజకీయ విధానాలను చూసిన పౌరుడు నమ్మడం మానేసి తనకి లబ్ధి చేకూరే విధంగా ఏ పార్టీ ఉంది అనే కోణంలో ఆలోచించి పూర్తిగా దేశ, రాష్ట్రాల క్షేమాన్ని తుంగలోతొక్కి భవిష్యత్తు తరాల వారి స్వాతంత్ర మూలాలను పణంగా పెట్టి ఒక నిర్లిప్త ధోరణిలో ఆశ వదులుకుని బ్రతుకుతున్నాడు. ఈ ప్రమాదకరమైన అంశం ఆలోచించే పౌరులు ఎంత మేరకు సమాజం కోసం ప్రతిఘటిస్తున్నారనేది ఆలోచించాల్సిన విషయం.
                    ఇంతటి ప్రమాదకరమైన స్థితిలోనికి నెట్టి వేయడానికి బలమైన కారణాలు : కులం, మతం, సాంప్రదాయాలు, భాష సంస్కృతి పట్ల అవగాహనా లోపం, జాతీయత, ప్రాంతీయతల మధ్య జరిగే సంఘర్షణ, అవినీతి, పర్యావరణంపై చిన్న చూపు.
                               పైన పేర్కొన్న ఈ ఏడు విషయాలు వ్యక్తిని గొప్ప వ్యవస్థలో మనగలిగే శక్తిగా తీర్చిదిద్దుతాయనే విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించాలి. వీటిపై పాలకుల తీరే నేటి భవిత అని ప్రతీ పౌరుడూ గుర్తిస్తే సమాజం ఉన్నతమైన స్థానానికి వెళ్ళే దారి దొరుకుతుంది. పర్యావరణాన్ని పాడుచేసి, అవినీతితో దేశ సంపదను బొక్కేస్తూ, ప్రాంతీయతల మధ్య చిచ్చులో చలికాచుకుని జాతీయతను విస్మరించి భాష సంస్కృతి సాంప్రదాయాలను భేఖాతరు చేసి వాటి మూలాల్లో ఉండే క్రమశిక్షణను విడిచిపెట్టి మతం నీడలో కులం మత్తులో ఉండిపోతున్న పౌరుడు ఎప్పటికి కళ్ళు తెరుచుకొని ఈ జాతి కోల్పోయేదేమిటో ఎప్పుడు గ్రహిస్తాడు..?? వాటి ఉనికిని పరిచయం చేసే వాడికి ఎప్పుడు మద్దతు ప్రకటిస్తాడు..??
                సాంప్రదాయ పునాదులే మన దేశాన్ని ప్రపంచ దేశాలలో విభిన్నంగా చూపిస్తూ గౌరవ మర్యాదలకు ఆలవాలమే దేశ విశిష్టతను చాటుతోంది. వాటిని విస్మరించి పాశ్చాత్య సంస్కృతి మోజులో శల్యపరీక్షను విడిచిపెట్టి ఇప్పుడు జరుగుతున్న నూతన పోకడలు మన పునాదులకే పరీక్ష పెడుతున్నాయి. సాంప్రదాయంలో ఇమిడి ఉన్న లోతైన ధర్మగుణం విధానాలు, స్వేచ్ఛా, సౌభ్రాతృత్వం కలగలిసిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటూ, వ్యక్తి జీవనశైలి వ్యవస్థ జీవనశైలికి దర్పణం అని చెప్పే అర్ధవంతమైన విషయంగా సమాజానికి చూపలేకపోతున్నాం.
ఎదుటి వ్యక్తి ఆచారాన్ని అందులో నున్న నిగూఢాన్ని గ్రహించలేని స్థితిలో మన జాతి ఉందంటే ఏ సంస్కృతి మూలాలతో అలరారే ఖజానాను విస్మరించి చిందులు వేస్తుందో, అందులో దొరికే మానసిక వికాసమేమిటో ఇప్పటి తరం వారు ప్రశ్నించుకోవాలి. వ్యక్తి అంటే వ్యవస్థలో భాగమే, నీవు అలవరుచుకున్న విధానాలే నిన్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి.. నీ వ్యక్తిగత విషయంగా పరిగణించే ఏ విషయమైనా సమాజంలో ఏ ఒక్కరికీ హాని తలపెట్టేది కానిదైతే చాలు.. దాని వలన భవిష్యత్తులో నువ్వు ఎదుర్కొనే సమస్యలకు నువ్వే జవాబు చెప్పుకోలేని పరిస్థితి రాకుండా ఉంటే చాలు.
“ కులాలను కలిపే ఆలోచనా విధానం..”
ప్రకృతి శక్తులకు కులం లేదు కానీ వాటి మీద ఆధారపడి బ్రతికే మనిషి అశాశ్వతమైన తన ఉనికికి కులం ఆపాదించుకున్నది ఒకరిపై ఒకరు ఆధారపడి బ్రతకమని తప్ప ఒకరిపై మరొకరి పెత్తనం చెయ్యమని కాదు. ఇది అలా క్రమేపీ సామాజిక వ్యవస్థ నుండి మనిషి ఆర్ధికపరమైన విషయంగా ముడిపడిపోయేసరికి దీని ఉద్దేశ్యంలో వైరుద్ధ్యము సంతరించుకుని ఆ కులం ముసుగులోనే సమాజాన్ని ఒక అస్తవ్యస్తమైన స్థితిలోకి నెట్టివేసింది. స్వాతంత్య్రం రాక మునుపు వరకూ ఈ కుల వ్యవస్థలో ఎన్నో రకాలైన ఆర్ధిక, మానసిక అంశాలు చాలా వరకూ స్నేహాన్ని, సహృ ద్భావాన్ని కోల్పోయే పరిస్థితిని తీసుకువచ్చాయి. ఈ పరిస్థితులే నేటికి లేకపోయినా గతం మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఎన్నో రకాలైన ప్రత్యేక చట్టాలు, అలా వెనకబడిన వారి సంక్షేమం కోసం ఎన్నో రకాలైన కుల కార్పొరేషనన్ల విధానాలు, రిజర్వేషన్ల కల్పన జరిగింది. కానీ దీని ఉనికి చావులేదు.. ఎందుకంటే ఈ అంశం వారి ఉన్నతి కన్నా వారి ఉనికే ప్రధానంగా మారడమే కారణం. నిజం నిష్టూరమైనా అది ఒప్పుకోక తప్పదు..!
కులం పేరు మీద అన్యాయమవుతున్న జాతి ఏదైనా ఉంటే అది భారతజాతి.., ఎన్నాళ్ళు ఇలా కులానికి ప్రోత్సాహకాలు యిస్తే జీవన విధానం మెరుగు పడుతుంది అనే కోణంలో ఏ ఒక్కరూ ఆలోచించ కపోవడం, ఇదే పరిస్థితి రేపు మరొకరికి ఎదురైతే వారు కూడా మేము అణగారిన వారమే అని అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏమీ సమ ధానం చెప్ప లేకపోవడం కూడా జరుగుతుంది. ఆ పరిస్థితిని ఈ రాజకీయ నాయకులు వారి స్వార్ధం కోసం పెంచి పోషిస్తున్నారు. కులం నీడలో ఎదగాలనే ఈ సామాజిక కోణంపై ఎంత త్వరగా ఈ చట్టసభలు ఉద్వాసన పలికే నిర్ణయం ప్రకటిస్తే దేశానికి అంత మంచిది. కనీసం ప్రాంతాల వారిగానైనా చేపట్టి దీనికి ముక్కుతాడు వెయ్యకపోతే ఎంతో మంది జ్ఞాన సంపద దేశానికి పనికి రాకుండా పోతుంది.
“మతాల ప్రస్తావన లేని రాజకీయం..”
దేశం మగ్గిపోతున్న అత్యంత హేయమైన చర్యలలో ఇది మరింత జుగుప్సాకరమైన కోణం. ధర్మాన్ని మించిన మతం ఉందా..?? మానవత్వాన్ని మించిన దైవం ఉందా..?? మతం అంటే మనిషిపై మనిషి చూపాల్సిన మానవత్వం. పరమత సహనమనే మాటను పూర్తిగా విస్మరించిన నేటి సమాజం మతం నీడలో ప్రత్యేకత సంతరించుకోవాలనే మూఢత్వంగా పరిణమించింది.. ఎన్నో శతాబ్ధాల చరిత్ర కలిగిన  దేశ హైందవ సంస్కృతి పై కూడా ఈ మత పరమైన మూఢత్వం వీడలేదు.. ఒక మతంలోనే ఎన్నో వర్గాలతో ఎవరికి వారు అన్యాయం చేసుకుంటున్న ఈ ఛాందస విధానాలు, రాజకీయ పార్టీలకు కూడా ఆపాదించే పరిస్థితి వచ్చింది. ఒక పార్టీకి మతం రంగు పూసిన తరువాత మరొక పార్టీ మిగిలిన వారికి వత్తాసు పలికినట్టేనా అని భావించడానికి కూడా వీలులేని స్థితిలోనికి మనిషిని తోసేసింది.. ఇంతా చేర్చి అదే మతం లోని వారికి ఒకరికొకరు సాయపడుతున్నార్రా అంటే అదీలేదు..!! అక్కడ వ్యక్తి స్వార్ధం మరలా తేటతెల్లమవుతుంది.. ఎన్నో దేశాలలో ఓకే మతంలోని వర్గాలకు సఖ్యత లేక నిరంతరం రక్తం పారుతూనే ఉంది. సాటి మనిషిపై మనిషి మానవత్వం ప్రదర్శిస్తే అదే దైవత్వం అని తెలియకుండా సామాజిక స్పృహ చంపేస్తున్నది ఎవరు..?? ఎవరు ఇదంతా చేస్తున్నారు..తరాలు ధర్మం కోసం పోరాడుతూ అలసి పోతుంటే మతం మాత్రం దాని విశృంఖలత్వాన్ని చూపిస్తూ నిశ్చేష్టులని చేస్తుంది.
“ భాషలను గౌరవించే సాంప్రదాయం.. ”
ఇక్కడే దేశ సమైగ్రతకు కావాల్సిన వెన్న దొరుకుతుంది. బాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయినా మనకి మాండలికాల ద్వారా స్వార్ధాన్ని చూపే చాంపల్యం వచ్చేసింది. ప్రతీ మాండలికం భాష ఔన్నత్యాన్ని చూపే సాధనమే. ఇక భాషకి భావమే మూలం.. నీవు పుట్టి పెరిగిన సమాజం నేర్పే నీ భాష, యాసలే నీవు అనుకుంటున్న భావాన్ని అందులో నుడిని గ్రహించగలవు. బలమైన ఆలోచనను చూపించగలవు. అరువు భాష బ్రతికేందుకు ఉపయోగపడుతుందేమో గానీ నీకు నువ్వుగా ఎదిగేందుకు నీ భాషే ఉపయోగపడుతుంది. భాషలపై గౌరవం ఉంటే నీ సాహిత్యం చెప్పే సూక్ష్మం, అది జగతికి నేర్పే ధర్మంపై అవగాహన వస్తుంది. ఏ భాషలోనైనా మనం పాండిత్యం సంపాదించాలన్నా నీ బాషపై నీకు పట్టు ఉండాలి. అదిలేనప్పుడు నీకు తెలిసిన భావన నిన్ను  గొప్పగా చిత్రీకరించలేదు.. ఎన్నో రాష్ట్రాలలో భాషకు యిచ్చే ప్రాధాన్యత చూస్తే మన రాష్ట్రం దౌర్భాగ్య స్థితిలో ఉందని చెప్పొచ్చు. పాలకులే భాష యొక్క ప్రాధాన్యతను, దాని విశిష్టతను ప్రజలకు దూరం చేస్తామని పట్టుదలగా ఉంటే ఎవరికి మొర పెట్టుకుని దాని ఉనికికై పోరాడాలి..?? సాహిత్య సౌరభాలను వదిలేస్తున్న నేటితరానికి ఏమని హితభోద చెయాలి..?? వ్యక్తిత్వవికాసాన్ని కాలరాసేసి గొప్పగా బ్రతుకుతున్నామనుకునే అల్పమైన స్థితిలోనికి నెట్టేస్తున్న ఈ పరిస్థితులను ఎలా ఎదిరించాలి..??
“ సంస్కృతులను కాపాడే సమాజం..”
ఆది నుండి మన సంస్కృతి నేర్పిన అంశం “ధర్మం”. ఈ సంస్కృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. పాశ్చాత్య పోకడలు వ్యవస్థను నిర్వీర్యం చేస్తాయి అనేకన్నా.. ఆ పోకడలలోని పరిధులు దాటే విశృంఖలత్వం గమనించలేని భారతాన్ని నిర్మించుకుంటే నీ ఉనికికి నువ్వే కొరివి పెడుతుంటే, ఆ అగ్నిలో కుటుంబ వ్యవస్థలు నాశనమవుతుంటే రేపు పురుడు పోసుకున్న వాడి వ్యక్తిత్వానికి ఎవరు ఆసరా అవుతారు.?? మనదేశ సంస్కృతిపై గౌరవమే మనదేశంపై  మనం చూపించే నిజమైన గౌరవం. అదే గౌరవాన్ని నువ్వు పొందాలనుకున్నా ఆ సంస్కృతి, సాంప్రదాయాలను నువ్వు విడనాడకుండా రేపటి నీ తరానికి కూడా ఆ ఫలాలను అందిచినప్పుడే నీ కీర్తి స్థిరత్వముగా ప్రకాశిస్తుంది. మనిషి జీవనవిధానం ఎలా నడిస్తే సుఖప్రదం అవుతుందో, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ఏ రకమైన ప్రణాళికలు మన పూర్వికులు రచించారో అవే మన సంస్కృతి సాంప్రదాయాలుగా కొనసాగింపబడాలి, అప్పుడే దేశంలో జరిగే ఎన్నో రకాల నేరాలకు అడ్డుకట్ట వేయడం జరుగుతుంది.
“ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం..”
ఈ వాదమే ప్రగతికి పునాది. ఈ వాదమే  అఖండ భారతావని దేదీప్యమానంగా వెలిగే ఉగాది. ప్రాంతీయత అభివృద్ది అనేది ఆ ప్రాంతం యొక్క భౌగోళికాంశాలు, సహజవనరుల లబ్ధిపైనే సహజంగా ఆధారపడి వుంటుంది. ఇచ్చి పుచ్చుకునే ఈ వ్యవహారమే జాతీయతావాదం. సవతి తల్లి ప్రేమలను ప్రదర్శించకుండా జాతీయవాదాన్ని బలంగా తీసుకువెళ్ళగల నాయకుల పని తీరుతోనే ఈ అంశం ముఖ్య భూమిక పోషిస్తుంది. తద్వారా దేశం సమైఖ్యంగా ఉంటుంది.

“అవినీతిపై పోరాటం..”
                     ఏ దేశ ప్రగతైనా ఆ దేశపాలకుల జవాబుదారీతనం పైనే ఆధారపడి వుంటుంది. అవినీతిపై కఠినమైన చర్యలు లేకుంటే మనిషి శ్రమను అప్పనంగా దోచేస్తారు. అవినీతి పెనుభూతమై చట్టం చేపట్టిన ఎన్నో కార్యక్రమాలకు అవరోధంగా మారి దేశసంపద కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంటే, ఆ మొత్తాన్ని తిరిగి దేశ, రాష్ట్ర ఖజానాలకు మళ్ళించలేనప్పుడు ప్రతి పౌరుడూ కట్టే పన్నులు స్వార్ధపరుల దాహానికి ఆవిరైపోతుంటే తగు చర్యలు లేకుండా న్యాయం కోసం యేళ్ళతరబడి ఎదురుచూపులు చూస్తుంటే సామాన్యుడికి చట్టాలపై విశ్వాసం సన్నగిల్లిపోతుంటే, నిరాశ, నిస్పృహల మధ్య వారు కూడా ఈ అవినీతమయ విధానాలకు వత్తాసు పలుకుతుంటే జరిగే అనర్ధాలకు ఎవరు సమాధానమిస్తారు..??

“ పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ది.. ”
                ఎంతో విశిష్టత కలిగిన పై పదంలో చాలామంది గ్రహించలేని విషయం దాగి ఉంది. ఎదుగుదల అంటే ఏమిటో అవగాహనలేని వారి చేతుల్లో ప్రకృతికి జరుగుతున్న అన్యాయమే మానవాళి తనకు తానుగా మోసం చేసుకుంటూ ప్రకృతి పగకు కారణమవుతున్న విధానం. దీనిని దూరదృష్టి ఉన్నవారు తప్ప సగటు మనిషి అర్ధం చేసుకోలేదు. పర్యావరణం దెబ్బతిన్నప్పుడు  జరిగే అనూహ్యమైన మార్పులు మనిషి జీవన విధానంలోనూ, శారీరక, మానసిక అంశాలపై కూడా పెనుప్రభావం చూపుతుంది. ఇప్పటికే సగటు మనిషి ఆయుర్ధాయం 80 సం. నుండి 60 సం.. పడిపోయింది. అదీ కూడా 30..40 పదుల వయసులోనే మందులతో జీవనాన్ని సాగించవలసిన దుస్థితి వచ్చింది. వీటికి కారణం పర్యావరణంలోని అసమతుల్యతే కారణం.నదీ జలాలు దోసిలితో తీసుకుని తాగలేని స్థితికి వాటిని మనం నాశనం చేశామంటే మనకన్నా మూర్ఖుడు ఎవరుంటారు! ఏ ప్రాణీ పర్యావరణాన్ని పాడుచేసి తన ఉనికి నిలుపుకోవడం లేదు కదా..?? అభివృద్ది అంటే కాంక్రీట్ అరణ్యాలు కాదు. అభివృద్ది అంటే పీల్చే గాలిలో, త్రాగే నీటిలో, తినే ఆహారంలో జీవితానికి అందించే ప్రాణదాత. ఈ పరిస్థితిని గుర్తించి ఎప్పటికి ఈ మొద్దునిద్రను వదులుతామో ఎవరికీ అర్ధం కాని స్థితి.!! తన గొప్పకు సమస్త జీవకోటి ప్రాణాలను పణంగా పెడుతున్న మనిషి ఈ ప్రకృతిని ఆరాధించడం ఎప్పుడు మొదలుపెడతాడు.. ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఈ పర్యావరణ అసమతుల్యత ఎన్నో రకాలైన అతివృష్టి, అనావృష్టి సంకేతాలను తెలియజేస్తూనే వుంది. వీటిని ఎదుర్కొనే ప్రణాళికలు పాలకులు చేపట్టకపోతే మనిషి తనకుతానే వారి పాలకుల మూలంగా కొరివి పెట్టుకున్నవాడవుతాడు.క్కడ చెప్పిన 7 అంశాలు మనిషి బాగు కోసం, ఒక ప్రణాళికా బద్ధమైన జీవన విధానంతో నేటి ప్రగతికి దారులు వేసే మానవత్వ ఛాయలు, సంస్కృతి సాహిత్యాల మేళవింపుతో ఒనగూరే మనోవికాసం, ఆర్ధిక పరమైన అంశాలతో నలిగిపోయే మనిషికి ధర్మంగా అందించవలసిన రక్షణ.

             వీటన్నిటిని ఒక సిద్ధాంతంగా ఎంచుకున్న  జనసేనపార్టీ లోతును గ్రహించడంలో, దేశ, రాష్ట్ర అవసరాలు మానవీయ కోణాలకు మద్దతు యిచ్చేందుకు మదనపడుతున్నారనే వేదన నాలోనే కాక చాలా మందికి బాధగానే ఉంది.! ఎందుకు మనం వ్యవస్థలో ఒక వ్యక్తినే అందలమెక్కించాలని చూస్తున్నాం మన ఆలోచనను ఎందుకుచంపేసుకుంటున్నాం..!! మనం కోరిన తీరుగా మార్పు కోసం ముందుకు వచ్చిన వాడి పనితీరు బాగుండకపోతే మరలా మనదగ్గరే ఉన్న అస్త్రంతో గుణపాఠం చెప్పొచ్చు కదా.!!?? కులం, మతం, ప్రాంతం అని అందరికీ అన్యాయం చేసుకునే ఈ నిర్లిప్తమైన ధోరణికి మీ ఆలోచనా శక్తి ఉపయోగపడకపోతే జరిగే అనర్ధాలు కళ్ళముందు కనబడుతున్నా ఎందుకు మీకు మనసు అంగీకరించడంలేదు.
విజ్ఞులు ఆలోచించండి.. సిద్ధాంతాలే ప్రామాణికంగా సాగే ఒక సదావకాశానికి మీరు చేయందించండి. ఒక్క అవకాశం యిచ్చి మీలో ఉన్న సామాజిక న్యాయానికి వెతుకుతున్న ఆర్ధ్రతకు బాసట చేయండి, ఆదరించండి.

“సిద్ధాంతానికే నా మద్దతు..
వ్యక్తిత్వానికే పూజ”


నిన్ను నువ్వు తెలుసుకోవడంలో సగం విజయం
నీ ఆచరణలో అప్రమత్తత మిగిలిన విజయం.


By
భాను శ్రీమేఘన
ట్విట్టర్ ఐడి : @ravikranthi9273

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way