నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు నష్ట పరిహారం చెల్లించాలి – శ్రీ పవన్ కల్యాణ్ గారు…
కౌలు రైతులను ఆదుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక కార్యచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయం ఉద్యోగుల సహాయంతో కౌలు రైతులను గుర్తించి, వారికి మిగిలిన రైతులతో పాటు పరిహారం అందచేయాలని సూచించారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా మోపిదేవిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. “తుపాను ప్రభావిత జిల్లాల నాయకులతో నాలుగు రోజుల క్రితం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాం. రైతుల బాధలు తెలుసుకున్న వెంటనే క్షేత్ర స్థాయిలో పర్యటించి వారికి అండగా నిలబడాలని నిర్ణయించాం. అందువల్లే కరోనా నిబంధనలు ఉన్నా ఈ రోజు పర్యటన చేపట్టాం. కంకిపాడు నుంచి ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి మీదుగా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మోపిదేవి మండలాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించడం జరిగింది. కరోనా సమయంలో కూడా రైతులు ప్రాణాలను పణంగా పెట్టి పండిస్తే.. తుపాన్ దెబ్బకి ప్రభుత్వ లెక్కల ప్రకారం 17 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో వారి బాధలు కచ్చితంగా బయటికి తెలియాలి. కంకిపాడులో వెయ్యి ఎకరాల ఆయకట్టులో 1600 మంది రైతులు ఉంటే అందులో వెయ్యి మంది కౌలు రైతులే ఉన్నారు. ఇలా పంటకు నష్టం వాటిల్లడం ఏడాదిలో ఇది మూడోసారి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం రెండున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, అందులో అత్యధిక శాతం అవనిగడ్డ నియోజకవర్గంలోనే ఉంది. నష్టపోయిన రైతుల్లో 60 శాతం కౌలు రైతులే ఉన్నారు.
అసెంబ్లీలో రైతులను ఎలా ఆదుకోవాలో చర్చించండి :
ఇలాంటి సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి పంపితే వారు అసెంబ్లీలో కూర్చుని బూతులు తిట్టుకుంటున్నారు. కనీసం రైతులను ఎలా ఆదుకోవాలి అన్న చర్చ కూడా చేయడం లేదు. ముందు ఆ విషయంపై చర్చించండి. హైదరాబాద్ లో వరదలు వస్తే తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం కింది ఇంటికి రూ. 10 వేలు ఇచ్చింది. మొత్తం రూ. 650 కోట్లు విడుదల చేసింది. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు పరిహారం చెల్లించాలి. తక్షణ సాయం కింద ఎకరాకి రూ. 10 వేలు ఇవ్వాలి. మొన్న చల్లపల్లి మండలంలో అప్పుల బాధ తాళలేక ఒక దళిత రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు అవనిగడ్డ మండలంలో ఒక మరో కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రభుత్వం ప్రకటించాలి.
పరిహారంలో పక్షపాతం వద్దు :
తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీలు ఉండేవి. ఇప్పుడు గ్రామానికి ఒక సచివాలయం ఉంది. సచివాలయం ఉద్యోగుల సాయంతో విచారించి కౌలు రైతులకు అండగా నిలబడాలి. మొదట వేసిన అంచనాల ప్రకారం పరిహారం చెల్లించాలి. రాలిన ప్రతి గింజను, తడిసిన ప్రతి గింజను పరిగణలోకి తీసుకోవాలి. మార్గమధ్యంలో మాజీ ఎంపీ శ్రీ కె.పి. రెడ్డియ్య యాదవ్ గారు ఆపి చెప్పారు.. కాలం గడచిన కొద్ది పరిహారం తగ్గించేస్తారు అని. అలాంటి పరిస్థితులు లేకుండా వెంటనే పరిహారం ఏర్పాటు చేయాలి. నష్టం ఎవరికి వాటిల్లినా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి కులమతాలకు, పార్టీలకు అతీతంగా పరిహారం చెల్లించే ఏర్పాటు చేయాలి. పరిహారం చెల్లించే విషయంలో పక్షపాతం లేకుండా చూడాలి. నాలుగు రోజుల పర్యటన ముగిసిన అనంతరం పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులతో కలసి ఒక కమిటీ ఏర్పాటు చేసి తుపాను నష్టంపై నివేదిక రూపొందిస్తాం. దాన్ని కేంద్రానికి సమర్పిస్తాం.
లాకులకు కనీస మరమ్మతులు కూడా లేవు :
ప్రభుత్వం, పాలకులు పట్టించుకోని పక్షంలో…. భవన నిర్మాణ కార్మికుల కోసం బలంగా నిలబడినట్టే రైతుల కోసం ఏ స్థాయి పోరాటం చేయడానికైనా జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో సంగమేశ్వరం వద్ద ఉన్న లాకులకు ప్రభుత్వం వెంటనే మరమ్మత్తులు చేయించాలి. ఆ లాకుల సమస్యే నన్ను కదిలించింది. లాకులు సరిగా లేకపోవడం వల్లే నష్ట తీవ్రత పెరిగింది. నీటి పారుదల ప్రాజెక్టులకు ఉన్న చిన్నపాటి రిపేర్లు వెంటనే పూర్తి చేయాలి.
రైతు కన్నీరు ఆవేదన కలిగిస్తుంది: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు :
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ..” తుపాన్ వల్ల దెబ్బ తిన్న పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాం. ఎక్కడ చూసినా తీవ్రమైన పంట నష్టం వాటిల్లింది. రైతులు కన్నీరు పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం” అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శీ తమ్మిరెడ్డి శివశంకర్, శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, అవనిగడ్డ నియోజకవర్గం ఇంచార్జీ శ్రీ ముత్తం శెట్టి కృష్ణారావు, పి. ఏ.సి. సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీ పోతిన మహేష్, శ్రీ అక్కల రామ్మోహన్, పార్టీ నాయకులు శ్రీ బండి రామకృష్ణ, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ కల్యాణం శివ శ్రీనివాస్, శ్రీ మండలి రాజేష్, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్, శ్రీ తాడిశెట్టి నరేష్, శ్రీ చలపతి, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.