- నేడు ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం
పులివెందుల, జూన్ 7 (జనస్వరం) : ఏటా జూన్ 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జరుపుకుంటారు. సముద్ర సంపదను రక్షించడం, కాలుష్యాన్ని అరికట్టడంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. సృష్టికి మూలం నీరు. అందులోనూ భూమిపై 71 శాతం ఆవరించి ఉన్న మహాసముద్రాలు భూగోళానికి ఊపిరి వంటివి. మనకు లభించే ఆక్సిజన్లో సగం (50 శాతానికి పైగా) సముద్రాల నుంచే ఉత్పత్తి అవుతుందంటే, కడలి ప్రాముఖ్యత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. మానవాళికి జీవనాధారమైన మహాసముద్రాల పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఏటా జూన్ 8ని ఐక్యరాజ్యసమితి "ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. జీవ వైవిధ్యానికి నిలయం గ్రహం మీద అతిపెద్ద సహజ వనరులలో సముద్రాలు ప్రధానమైనవి. ఇవి కోట్ల కొద్దీ జలచరాలకు ఆవాసాలు. మానవుడికి ఆహార ఉత్పత్తులు, ఆర్థిక వనరులతో పాటు భూతాపం (గ్లోబల్ వార్మింగ్) తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. సముద్రాలు మానవులు ఉత్పత్తి చేస్తున్న కార్బన్ డయాక్సైడ్లో దాదాపు 30 శాతం వరకు గ్రహిస్తున్నాయి.కాలుష్య కోరల్లో కడలిఅంతటి ప్రాముఖ్యత కలిగిన మహాసముద్రాలు నేడు తీవ్ర కాలుష్య ముప్పును ఎదుర్కొంటున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడకం వల్ల సముద్రాలు కలుషితమవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర గర్భానికి చేరడంతో పాటు, సముద్ర జీవుల మనుగడకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. ఫలితంగా మత్స్య సంపద తగ్గిపోతోంది. సముద్ర సంరక్షణే మన భవిష్యత్తు మహాసముద్రాల సంరక్షణ కోసం ప్రపంచ దేశాలు సమిష్టిగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, వ్యర్థాలను సముద్రాల్లో కలవకుండా నివారించడం అత్యవసరం. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి మహాసముద్రాల రక్షణపై ప్రపంచవ్యాప్తంగా యువత, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలను ఏకం చేస్తూ అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది సముద్రాలను పరిరక్షించడం అంటే భావితరాలకు భద్రమైన భూమిని అందించడమే. ఈ మహత్తర కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి