అసెంబ్లీలో బూతులు తిట్టుకోవడం కాదు… రైతులకు ఎలా న్యాయం చేయాలో చూడండి – శ్రీ పవన్ కల్యాణ్ గారు…

అసెంబ్లీలో బూతులు తిట్టుకోవడం కాదు… రైతులకు ఎలా న్యాయం చేయాలో చూడండి – శ్రీ పవన్ కల్యాణ్ గారు…

                            రాష్ట్రంలో కౌలు రైతుల గోడు దయనీయంగా మారిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు అన్నారు. నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సొంత భూమి ఉన్న రైతులతోపాటు కౌలు రైతులకు కూడా సమంగా న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ ఖజానాలో బాగా డబ్బు ఉందని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు… కాబట్టి నష్టపోయిన పంటలకు ఎకరాకి రూ. 25 వేల పరిహారం అందచేయాలన్నారు. కృష్ణా జిల్లాలోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టారు. ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి, పెదప్రోలు ప్రాంతాల్లో నీటి పాలయిన పంటలను పరిశీలించారు. రైతుల బాధలు స్వయంగా విన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. “నివర్ తుపాను కారణంగా 5 జిల్లాల పరిధిలో 17 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఎక్కువగా వరి పంట దెబ్బతింది. మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందన్న సమయంలో చేజారిపోయింది. ఎకరాకి రూ. 30 వేల నుంచి రూ. 40  వేల వరకు రైతులు నష్టపోయారు. ఈ సీజన్ లో మూడుసార్లు అన్నదాతలు పంటను కోల్పోయారు. రైతుల బాధల గురించి మాట్లాడే నాయకులే కరువయ్యారని మాజీ ఎం.పి. శ్రీ కేపీ రెడ్డయ్య గారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంత మంది రైతుల కన్నీరు  రాష్ట్రానికీ, దేశానికీ మంచిది కాదు. నేను కూడా రైతునే. అందుకే రైతులకు అండగా ఉండాలని మీ ముందుకు వచ్చాను. పుట్టిన రోజులు, పండుగ రోజులు చేసుకోవడానికి రాలేదు. వైసీపీ ప్రజా ప్రతినిధులు రైతుల మధ్యకు వచ్చి అండగా నిలబడండి.  అసెంబ్లీలో కూర్చుని బూతులు తిట్టుకోవడం కాదు.  రైతులకు ఎలా న్యాయం చేయాలో ఆలోచన చేయాలి. రైతుల పక్షాన జనసేన పార్టీ పోరాడుతుంది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి జనసేన నాయకులు అండగా ఉంటారు.

కష్టాల్లో ఉన్న మీ కన్నీరు తుడచి, మీలో భరోసా నింపాలని నేను వచ్చాను. అధికారం కోసం అర్రులు చాచడం కాదు. సమస్యల పరిష్కారం కోసం జనసేన పని చేస్తుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి కౌలు రైతులకు ఎలా న్యాయం చేయాలో పరిశీలిస్తుంది. ఒక నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందచేస్తాం. రైతులకు న్యాయం జరిగేలా విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తాం. తుపాను రైతులను నట్టేట ముంచింది” అని అన్నారు. 

ఉదయం 10 గంటల ప్రాంతంలో కృష్ణా జిల్లా పర్యటన నిమిత్తం కంకిపాడు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఉయ్యూరు బైపాస్ రోడ్డు వద్ద తడిసిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి పామర్రు నియోజకవర్గం ఒండ్రిపూడి సమీపానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం అయ్యంకి సమీపంలో పొలాల మధ్యకు వెళ్లి రైతుల వద్ద నుంచి నివర్ తుపాను కారణంగా జరిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు. అయ్యంకి దాటిన తర్వాత వైసీపీ శాసనసభ్యుడు శ్రీ కొలుసు పార్ధసారధి తండ్రి, మాజీ ఎంపి శ్రీ కేపీ రెడ్డియ్య యాదవ్ గారు శ్రీ పవన్ కల్యాణ్ గారిని కలిసి పంట నష్టం, ప్రభుత్వాలు స్పందించే తీరును వివరించారు. 

కూచిపూడి, మొవ్వ, కొడాలి మీదుగా పార్టీ శ్రేణులు ప్రజల ఘనస్వాగతం మధ్య చల్లపల్లి చేరుకున్నారు. చల్లపల్లి మండలం పాగోలు రోడ్డు వద్ద ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు శ్రీ గద్వాల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించి, వారికి జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయం అందచేశారు. అక్కడి నుంచి మోపిదేవి మండలం పెదప్రోలు చేరుకుని రైతుల వద్ద పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా జనసేన నేతలు శ్రీ పోతిన మహేష్, శ్రీ అక్కల రామ్మోహన్, శ్రీ ముత్తంశెట్టి కృష్ణారావు, శ్రీ బండి రామకృష్ణ, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ మండలి రాజేష్, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్, శ్రీ తాడిశెట్టి నరేష్, శ్రీ చలపతి, శ్రీ పులిపాక ప్రకాష్, శ్రీ బంద్రెడ్డి రామకృష్ణ, శ్రీ బి.వి.రావు, శ్రీమతి రావి సౌజన్య, శ్రీ ఆకుల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.