అమరావతి, అక్టోబర్ 10, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్గా నల్లే ప్రసన్న కుమార్ నియమితులయ్యారు. ఈ నియామక ఆదేశాలను ప్రభుత్వం విడుదల చేసింది. నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధికి సామర్ధ్యం ఉన్న ప్రాంతాలను గుర్తించడం, యువ వ్యాపారులకు ప్రోత్సాహం అందించడం, జిల్లాల వారీగా MSME వృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయడం వంటి కీలక కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. MSME రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు పేర్కొన్నారు. కొత్త డైరెక్టర్ నియామకం ఈ రంగం పురోగతికి దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత అనుకూల వాతావరణం సృష్టించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నియామకం జరిగినట్లు తెలిసింది. అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీ ఉదయ్ తంగేళ్ళ శ్రీనివాస్ కు ప్రసన్న కుమార్ ధన్యవాదాలు తెలిపారు.