విజయనగరం, అక్టోబర్ 25, (జనస్వరం) :
‘రైతన్న - మీ కోసం’ వారోత్సవాల సందర్బంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఈరోజు డెంకాడ మండలం పెదతాడివాడ రైతు సేవా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 24 నుండి 29 వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే మాధవి రైతులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతేనని ఆమె పేర్కొన్నారు. రైతే దేశానికి వెన్నెముక అని వ్యాఖ్యానిస్తూ, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను అలవరచుకుని అధిక దిగుబడులు సాధించాలంటూ సూచించారు. పంటల బీమా, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. రైతులకు అందుతున్న సదుపాయాలపై ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. రైతు సేవ కేవలం ఒక కార్యక్రమం కాదు, నిరంతర ఉద్యమంలా కొనసాగించాలని ఎమ్మెల్యే మాధవి అధికారులకు సూచించారు. రైతు సేవా కేంద్రాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బాధ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.