
విజయనగరం, నవంబర్ 1, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ మండలం గుణుపూర్ పేట పంచాయతీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రారంభించారు. జే జే యం వాటర్ ట్యాంక్, వెల్నెస్ సెంటర్, రైతు సేవా కేంద్రం (RSK), వ్యవసాయ డ్రోన్ పాంపిణీ వంటి ప్రాజెక్టులను ఆమె శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన జే జే యం వాటర్ ట్యాంక్ నిరంతర శుద్ధ నీటి సరఫరా అందించేలా ఉంటుంది. వెల్నెస్ సెంటర్ ద్వారా ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు అందించనున్నారు. రైతుల అభివృద్ధి కోసం రైతు సేవా కేంద్రం (RSK) ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాంకేతిక సలహాలు మరియు పంటల మార్కెటింగ్ సహాయం అందించనుంది. వ్యవసాయ డ్రోన్ పాంపిణీ ద్వారా రైతుల పిచికారీ పనులు సులభతరమవుతాయి, సమయం మరియు ఖర్చు తగ్గుతాయి. ఈ కార్యక్రమంలో డెంకాడ ఎంపీపీ వాసుదేవరావు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ, “ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం, గ్రామాల అభివృద్ధి కోసం శాశ్వత సదుపాయాలు కల్పించడం నా లక్ష్యం. నీటి, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో చేపట్టిన ఈ కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి కొత్త దిశ చూపుతాయి” అన్నారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ, తమ గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని సంతోషం వ్యక్తం చేశారు.