నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 115వ రోజున 13వ డివిజన్ బాలాజీనగర్, లక్ష్మీ నగర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గతేడాది జనసేనపార్టీ తరఫున తాము ఎంత మొత్తుకుంటున్నా వినకుండా అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోమశిల జలాశయం వద్ద డ్రోన్ షాట్లు, జూమ్ షాట్లు కోసం 78 టీఎంసీల కెపాసిటీ కల్గిన డ్యామ్ లో వరద సమయంలో 7.95 టీఎంసీల కుషన్ లెవల్ మెయింటైన్ చేయాల్సి ఉండగా చేయకుండా 77 టీఎంసీల వరకు గేట్లు ఎత్తకుండా చేశారన్నారు. ఎగువున అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి సోమశిల డ్యామ్ కూడా కొట్టుకుపోయే స్థితిలో ఒక్కసారిగా 5.31 లక్షల క్యూసెక్కుల పైగా వరదను విడుదల చేసి సోమశిల పరివాహక ప్రాంతాలతో పాటు నెల్లూరు నగరంలో కూడా విపత్తుకి కారణమయ్యారు అని అన్నారు. ఆ సమయంలో సోమశిల రివిట్మెంట్ పూర్తిగా దెబ్బతిందని, ఈ అంశాలపై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకి ఫిర్యాదు చేస్తే ఇప్పటికీ విచారణ లేదని, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాత్రం సోమశిలలో ఎందుకు కుషన్ లెవల్ మెయింటైన్ చేయలేదని అధికారులను ప్రశ్నించారని గుర్తు చేశారు. గతం నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకుని సోమశిల జలాశయంలో కుషన్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఒక్కసారిగా లక్షల క్యూసెక్కుల నీరు కాకుండా ప్రతి రోజూ తక్కువ మోతాదులో వరద నీటిని విడుదల చేస్తూ జలాశయాన్ని, పరివాహక ప్రాంతాలను కాపాడాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
