ప్రజల కోసం బలంగా మన గొంతు వినిపించండి : పవన్ కళ్యాణ్
* సమస్యల పరిష్కారంలో జనసేన పాత్ర క్రియాశీలకం కావాలి
* తెలంగాణ యువజన, విద్యార్థి విభాగాలకు సూచన
* జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు
ధైర్యంగా గళమెత్తి పోరాటం చేయడం అనేది తెలంగాణ ప్రజల్లో ఉంది... మన చుట్టూ ఉన్న సమస్యలపై ప్రభావశీలంగా మాట్లాడాలి అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. యువకులు, విద్యార్థులు రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్ళి ప్రజలకు అండగా ఉండాలి అన్నారు. జనసేన పార్టీ తెలంగాణ విభాగం ఇటీవల నియమించిన విద్యార్థి, యువజన కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులతో శ్రీ పవన్ కల్యాణ్ గారు బుధవారం మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ వి.వి.రామారావు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీ టి.సంపత్ నాయక్, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ వి.లక్ష్మణ్ గౌడ్, ఈ కమిటీల సభ్యులకు, సాంస్కృతిక విభాగం కార్యదర్శి శ్రీ దుంపటి శ్రీనివాస్ కు నియామక పత్రాలు అందించారు.
అనంతరం శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ "మన చుట్టూ ఉన్న ప్రజల కోసం బలంగా నిలబడి గొంతు, వినిపించండి. ఆ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా పని చేయాలి. సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ తరపున అందరం క్రియాశీలకంగా వ్యవహరించాలి. మీ వెన్నంటి నేను ఉంటాను. ఆదిలాబాద్ జిల్లాలోని, మారుమూల ప్రాంతాల్లో కావచ్చు... కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో కావచ్చు... పాలమూరు రైతులు, కూలీల ఇబ్బందులు కావచ్చు... ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా స్పందిద్దాం. మన వంతుగా మనం అండనిచ్చి నిలబడదాం. ఎప్పటికప్పుడు కమిటీలతో సమావేశం అయి చర్చిద్దాం" అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జ్ శ్రీ ఎన్.శంకర్ గౌడ్, ముఖ్య నాయకులు శ్రీ రామ్ తాళ్ళూరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ ఆర్.రాజలింగం పాల్గొన్నారు.