నెల్లూరు, మార్చి 29, జనస్వరం : నెల్లూరులోని కృష్ణ చైతన్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలను మినీ బైపాస్లోని జిపిఆర్ కళ్యాణమండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ ఆర్.వి. కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల విద్యార్థులు సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలపై సిబ్బంది వివరాలు అందించారు. యూనివర్సిటీ స్థాయిలో విశిష్ట ఫలితాలు సాధించిన విద్యార్థులను అతిథులు అభినందించి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అధ్యాపక సిబ్బంది అతిథులను ఘనంగా సత్కరించారు. కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తూ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందడం గర్వకారణమని అతిథులు పేర్కొన్నారు. అధ్యాపకుల ప్రోత్సాహం వల్లే విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. కళాశాలకు NAAC గుర్తింపు, అటానమస్ హోదా రావడం నాణ్యమైన విద్యకు నిదర్శనమని తెలిపారు. గత 18 సంవత్సరాలుగా యూనివర్సిటీ స్థాయిలో టాప్ 10 ర్యాంకులను సాధించడం విశేషమని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యాసంస్థలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తూ ఉద్యోగ అవకాశాలు పొందడం అభినందనీయమని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల డీన్ తమిదెల జ్యోతి, ప్రిన్సిపాల్ ప్రసాద్, విద్యాసంస్థల డీన్లు రామాంజనేయులు రెడ్డి, సుధారాణి, అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
