కోవిడ్‌ పరీక్ష కేంద్రాలు పెంచాలి : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

– ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానం అవసరం
– టీడీపీ అధినేత నారా చంద్రబాబు త్వరగా కోలుకోవాలి
         అమరావతి/హైదరాబాద్, (జనస్వరం) : దేశంలోను, తెలుగు రాష్ట్రాలలో నమోదవుతున్న కోవిడ్‌ రోగుల గణాంకాలు ఆందోళనకరంగానే ఉన్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు, అందించే ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతో పాటు పోలీసులు, స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో కోవిడ్‌ బారిన పడుతున్నారని వస్తున్న వార్తలు విచారం కలిగిస్తున్నాయన్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయవేత్తలు కూడా కోవిడ్‌ బారినపడుతుండడం దీని తీవ్రతను తెలియచేస్తోందన్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు మరింత అప్రమత్తతతో కోవిడ్‌ నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ పరీక్షలు పెంచడం ద్వారా వైరస్‌ సోకినవారిని గుర్తించి వైద్యం చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఇందుకోసం పరీక్ష కేంద్రాలు పెంచాలన్నారు. మొబైల్‌ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని, అలాగే కరోనా మొదటి వేవ్‌ సమయంలో పాటించిన ట్రాక్‌ అండ్‌ ట్రేన్‌ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలియజేశారు. ఏపీలో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుత తరుణంలో వాంఛనీయం కాదన్నారు. కోవిడ్‌ ఉధృతి తగ్గే వరకు తరగతులను వాయిదా వేయవలసిందిగా కోరారు. పిల్లలకు వాక్సినేషన్‌ పూర్తికాకపోవడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్లిష్ట తరుణంలో మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉందాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని వెల్లడిస్తోందన్నారు. ఈ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి.. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలన్నారు. అవి లేకుండా మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటి.? అని ప్రశ్నించారు.

అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి : 
    ప్రజలంతా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, మాస్క్‌ లేకుండా దయచేసి బయటకు రావద్దని, భౌతిక దూరం పాటించలని, వృద్దులు, దీర్హకాలిక అనారోగ్యంతో ఉన్న వారు, పిల్లల విషయంలో అప్రమత్తత పాటించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.