నివర్ తుపాను బాధిత రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రానున్న సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. రైతాంగానికి మద్దతుగా 175 నియోజకవర్గాలకు చెందిన జనసేన శ్రేణులతో ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించింది. గురువారం తిరుపతిలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి అధ్యక్షతన, పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశం అనంతరం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కందుల దుర్గేష్, శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి పాలవలస యశస్విలు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ దుర్గేష్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో కక్ష సాధింపు ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రజా సమస్యల మీద ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా పోలీస్ యాక్షన్ కి దిగే పరిస్థితి. రాష్ట్రంలో 144 సెక్షన్, సెక్షన్ 30 అమలులో లేని రోజు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతలు ఏ విధంగా నెలకొల్పుతారు. రైతుల అభివృద్ధి పట్ల కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. నివర్ తుపాను, ప్రకృతి వైపరిత్యాల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు తక్షణ సాయం కింద రూ. 10 వేలు, పరిహారంగా ఎకరాకి రూ. 35 వేలు డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ తరఫున దీక్షలు చేపట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. క్రియాశీలక సభ్యత్వాల విషయానికి వస్తే మొదట 5 నియోజకవర్గాలతో ప్రారంభించి ప్రస్తుతం మూడో విడత 64 నియోజకవర్గాల్లో కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. భారీ ఎత్తున క్రియాశీలక సభ్యుత్వాలు నమోదవుతున్నాయి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పాత్రికేయులు, జనసైనికులు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానం చేసింది.
గిద్దలూరులో వైసీపీ ప్రభుత్వ దాష్టికానికి బలైన జనసైనికుడు శ్రీ వెంగయ్య నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సమావేశం రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. గ్రామం సమస్య మీద మాట్లాడితే దూషణ చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ అన్నా రాంబాబు గారి విధానాన్ని ఖండిస్తూ, జనసైనికుడు శ్రీ వెంగాయ్య నాయుడు ఆత్మకు శాతిం చేకూరాలన్న లక్ష్యంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు 23వ తేదీన శ్రీ పవన్ కల్యాణ్ గారు ఒంగోలులో పర్యటించనున్నారు” అని అన్నారు. శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. “తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎవరు పోటీ చేయాలి అనే అంశంపై ఇరు పార్టీలు మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా నెగ్గే అభ్యర్ధినే నిలబెడతాం. ఇప్పటికే జనసేన పార్టీ పార్లమెంట్ అధ్యయన కమిటీ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తల అభిప్రాయం సేకరిస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగా ఓ నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు.