ఉరవకొండ, అక్టోబర్ 24, (జనస్వరం): వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు రూపనాయక్ విద్యుత్ ప్రమాదంలో మరణించిన ఘటనపై జనసేన పార్టీ స్పందించింది. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించడంతో, ఈ రోజు మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆర్థిక సహాయం అందించారు. MLC కొణిదెల నాగబాబు, జనరల్ సెక్రటరీలు శ్రీరామ్ తళ్లూరి, టి శివశంకర్, ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జి గౌతమ్ కుమార్ సమక్షంలో రూపనాయక్ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాల్లో మరణించిన 220 మంది క్రియాశీలకుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మొత్తం 11 కోట్లు పంపిణీ చేసినట్లు నేతలు తెలిపారు. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ—ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమా, అత్యవసర సమయంలో 50 వేల వరకు తక్షణ సహాయం జనసేన తరపున అందుతున్నదని తెలిపారు. రూపనాయక్ తల్లి కమలమ్మ చెక్ అందుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రతి క్రియాశీలకుడి కుటుంబానికి అండగా నిలిచే నాయకుడు అని భావోద్వేగంతో పేర్కొన్నారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా నగర అధ్యక్షుడు పొదిలి బాబూరావు, వజ్రకరూరు మండల అధ్యక్షులు అచనాల కేశవ్, సూర్య నాయక్, క్రియాశీలక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.