ఆత్మకూరులో ఏర్పాటుచేయాల్సిన పరిశ్రమ తరలింపు అన్యాయం? నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్

   ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రం నుండి బద్వేలుకు తరలి వెళ్లిన సెంచరీ ప్లైవుడ్ కర్మాగారం తిరిగి ఆత్మకూరు తరలించేలా చేపట్టవలసిన పోరాటాలు మరియు పారిశ్రామిక పార్కు అభివృద్ధి చెందేందుకు చేపట్టవలసిన చర్యల గురించి చర్చించేందుకు ఈ రోజు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో అన్ని రంగాల్లో దశాబ్దాలుగా దగాకు గురవుతున్న, మన ఆత్మకూరు ప్రజానీకం మరోసారి దగా కాబడింది అన్నారు. స్థానిక శాసన సభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారిచే ఎంతో ఆర్భాటంగా, అట్టహాసంగా శంకుస్థాపన చేయబడిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ, ఇక్కడి నుండి తరలింపునకు గురై, కడప జిల్లా బద్వేలులో ముఖ్యమంత్రి గారిచే శంకుస్థాపన చేయబడింది. ఈ చర్యతో దశాబ్దాలుగా పదేపదే దగాకు గురి కాబడ్డ మన ఆత్మకూరు ప్రజానీకం మరొకసారి దగాకి గురయ్యారు. ముఖ్యమంత్రి గారు తన సొంత జిల్లా అయిన బద్వేల్ లో పరిశ్రమ పెట్టదలచుకుంటే మరొక పరిశ్రమను తీసుకుని వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకానీ ఇక్కడ ఆర్భాటంగా శంకుస్థాపన చేయబడి, ఆత్మకూరు అభివృద్ధి బాట పడుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆత్మకూరు ప్రజానీకం నమ్మకాన్ని వమ్ము చేస్తూ మరియు తమకు ఉపాధి దొరుకుతుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న యువత ఆశలపై నీళ్లు చల్లి, ఈ ప్రాంత అభివృద్ధిని సమాధి చేస్తూ, ఈ పరిశ్రమను బద్వేలు తరలించడం ఎంతో శోచనీయం అన్నారు. 1600 కోట్ల రూపాయల పెట్టుబడులు, 2500 ల పై చిలుకు ప్రత్యక్ష ఉద్యోగాలు, ఐదు వేల పైచిలుకు పరోక్ష ఉద్యోగాలు, జామాయిల్ రైతులకు ఎంతో ఉపయోగకరమైన, ఈ పరిశ్రమ వస్తుందని, దీంతో పాటు అనుబంధ పరిశ్రమలు అనేకం వస్తాయని,ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రజానీకానికి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. నెల్లూరు జిల్లాలో అత్యంత వెనకబడ్డ దశాబ్దాలుగా దగాకు గురి కాబడ్డ, ఆత్మకూరు నియోజకవర్గానికి ఇంతటి అన్యాయం చేయడం అత్యంత దారుణమైన విషయం. గతంలో ఇక్కడ శంకుస్థాపన చేయబడి, భూ సేకరణతో సహా, మౌలిక సదుపాయాలు కల్పించబడ్డ, ఈ పరిశ్రమను ఇక్కడే నెలకొల్పాలని, లేనిపక్షంలో దశాబ్దాలుగా దగాపడ్డ ఆత్మకూరు ప్రజల గొంతుకై అఖిల పక్షం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకట్ సుబ్బానాయుడు, దావా పెంచల రావు, గౌస్ బాష, భారతీయ జనతాపార్టీ నాయకులు కరటంపాటి సుధాకర్, నలిశెట్టి శ్రీనివాసులు, సిపిఎం నాయకులు లక్ష్మీపతి, డేవిడ్ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజా, జనవిజ్ఞాన వేదిక నాయకులు లక్కు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.