హైదరాబాద్, జనవరి 23, జనస్వరం : చదువుకున్నవారంతా పరాయి భాషావ్యామోహంలో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేస్తుంటే, నిరక్షరాస్యులు తెలుగుభాషను రక్షిస్తున్నారని తెలుగు వన్ వ్యవస్థాపకులు కంఠంనేని రవిశంకర్ పేర్కొన్నారు. గిడుగు రామమూర్తి ఫౌండేషన్, రఘు ఆరికపూడి సేవాట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిడుగు వర్థంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రముఖ కవి, 'కళారత్న' డా. బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కంఠంనేని రవిశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గిడుగు రామమూర్తి పంతులు ప్రజలభాషను, పాలనా భాషగా, పాఠ్యాంశాల భాషగా, పత్రికా భాషగా మార్చడానికి జీవితమంతా పోరాటం చేశారని తెలిపారు. ఆ మహానుభావుని స్ఫూర్తితో యువకవులను రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కవయిత్రి స్వాతి శ్రీపాద రాసిన 'కలనేత' కావ్యాన్ని, "పారిజాతం" ప్రత్యేక సంచికను కంఠంనేని రవిశంకర్, 'కలలకు కాలం చెల్లింది' కవితా సంపుటిని ప్రముఖ కవి డా. వి.డి. రాజగోపాల్ ఆవిష్కరించారు. ప్రముఖ సంఘసేవకులు డా.మునగా రామమోహనరావుకు, సాహితీవేత్త డా. అక్కిరాజు సుందర రామకృష్ణకు ఈ సందర్భంగా గిడుగు జాతీయ జీవన సాఫల్య పురస్కారాలను అందజేశారు. భాషా సాహిత్య పరిశోధనా పుస్తకాలతో పాటు పలువురు కవులు, కళాకారులు, సాహితీ పోషకులకు "గిడుగు జాతీయ పురస్కారాలు" అందజేశారు. ఈ సభలో గిడుగు ఫౌండేషన్ అధ్యక్షులు గిడుగు కాంతి కృష్ణ, శంకరం ఫౌండేషన్ అధ్యక్షులు యలవర్తి ధనలక్ష్మి, ప్రముఖ కవులు మువ్వా శ్రీనివాసరావు, డా. రాధాకుసుమ, కోగంటి ఉషారాణి, పద్మశ్రీలత, రాజరాజేశ్వరి మారెళ్ళ, గాయని పెన్నా సౌమ్య తదితరులు పాల్గొన్నారు. గిడుగు భాషాసేవలను కీర్తిస్తూ డా. రాధా కుసుమ నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనం సభికులను ఆలోచింపజేసింది.