హిందుత్వం అనేది ఒక జీవన విధానం : పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడు శేషుకుమారి
మన భారతదేశం లో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాం. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వాలు పరిపాలించాలి. ఇటీవల జరిగిన అంతర్వేది సంఘటన చాలా దుర్మార్గకరమైన సంఘటన. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సుమారు 60 సంవత్సరాలు నాటి ఈ రథం కాలిపోవడంతో చాలా మంది మనోభావాలు దెబ్బ తినడమే కాకుండా రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం నెలకొనేలా పరిస్థితులు జరుగుతున్నవి. ఈ ఒక్క సంఘటనే కాదు, గతంలో కొన్ని నెలల క్రితం మన పిఠాపురంలో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత కట్టడం అన్నది వేరే విషయం కానీ హిందువులు అందరూ చాలా బాధ పడ్డారు. ప్రభుత్వం దానిని ఒక పిచ్చి వాడు చేసిన పని అని కొట్టి పారేసింది గానీ కఠినమైన చర్యలు తీసుకొని వుంటే ఇలాంటి చర్యలు పునరావృతం కాకపోవును. మన ప్రియతమ ప్రధాని శ్రీ మోడీ గారు అయోధ్యలో ఎంత కాలంగానో అపరిష్కృతంగా వున్న రామాలయం పునఃప్రతిష్టతో భారతదేశ కీర్తి ప్రతిష్టతలను పెంపొందిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం వరుస దాడులతో భయానకం సృష్టిస్తున్నారు. హిందూత్వం అనేది ఒక జీవన విధానం. మతానికి ఆపాదించకుండా మనమందరం సోదర భావంతో ఆప్యాయతతో నిస్వార్ధంగా, ఇతరులకు అపకారం తలపెట్టకుండా మహోన్నతంగా జీవించడమే. కానీ ఈ ప్రభుత్వం ఆ రథం కాలి పోతే, పోనీ ఇంకొక రథం చేయిస్తాం, 95 లక్షలతో మళ్లీ రథం ఇస్తాం అంటున్నారు. భాధ్యత గల దేవదాయ శాఖ మంత్రి గారు ఇంత భాధ్యతారహితంగా మాట్లాడి మరింత కృంగ దీసారు. గానీ అసలు ఈ రథాన్ని కాల్చినది ఎవరు అనే ఎంక్వైరీ చేసినట్టు కనిపించడం లేదు. దానికోసం చర్చించినట్లు ఎక్కడ కనిపించటంలేదు. వెంటనే ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రజలు ముందు నిలబెట్టి ఎటువంటి తప్పు మళ్లీ చేయకుండా వాళ్లని శిక్షించాలి ఇలా చేయకపోతే ఈ ప్రభుత్వం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడు శేషుకుమారి అన్నారు.