వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి - ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
క్రోసూరు,ఏప్రిల్ 06 (జనస్వరం)
ప్రస్తుత సమాజంలో సాధారణం కంటే ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఎండ, వడగాల్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల ప్రజలందరూ మరింత జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు.మండలం లోని ఆవులవారిపాలెంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రచురించిన "తీవ్రమైన ఎండ/వడదెబ్బ పై ప్రజా ఆరోగ్య సూచనలు"అనే కర పత్రములను వైద్య సిబ్బంది సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలన్నారు.ప్రయాణించేటప్పుడు త్రాగునీరు వెంట తీసుకొని వెళ్ళాలి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓ ఆర్ ఎస్ ఉపయోగించాలని, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాల్లో కొద్దిగా ఉప్పు కలిపి త్రాగాలన్నారు.సన్నని వదులుగా లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించటం మంచిదని పేర్కొన్నారు. వడదెబ్బకు శిశువులు మరియు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులు గుండె జబ్బులు అధిక రక్తపోటు ఉన్నవారు వడదెబ్బకు ఎక్కువగా గురవుతారన్నారు .అధిక శరీర ఉష్ణోగ్రత మరియు ఏదైనా అపస్మారక స్థితి గందరగోళం లేదా అధికంగా చెమటలు పట్టడం ఎవరిలోనైనా కనిపిస్తే 108 వాహనానికి కాల్ చేయాలన్నారు.
సమీపంలోని ఆరోగ్య కార్యకర్తను గాని, ఆశా కార్యకర్తను గాని సంప్రదించి ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యూషన్ (ఓ . ఆర్. ఎస్) ప్యాకెట్లు తీసుకోవచ్చని తెలిపారు