ఉదయగిరి, అక్టోబర్ 14, (జనస్వరం) : జలదంకి మండలం చిన్నక్రాకలో జనసేన పార్టీ తరఫున నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. గుండబతిన రామమూర్తి, తేలప్రోలు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ సభ్యుడు బోగినేని కాశీరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులతో కలిసి పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ప్రాముఖ్యతను పిల్లలకు వివరించిన ఆయన, అందరికీ నోటు బుక్కులు, చాక్లెట్లు, పెన్లు, పెన్సిల్లు, బిస్కెట్లు పంచుతూ చదువుపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.
పిల్లలు తమ జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాన్ని నిర్ణయించుకుని, ఆ దిశగా క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మాటలను గౌరవిస్తూ మంచి మార్గంలో నడవాలని పిల్లలకు సూచించారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని, వారిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు మంచి విద్య అందించడమేగాక, వారిని భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దడం మనందరి కర్తవ్యమని అన్నారు. కార్యక్రమంలో జలదంకి మండలం దాసరి అగ్రహారం చెరువు వైస్ చైర్మన్ మాధవరావు, పసుపులేటి వెంకటేశ్వర్లు, మురళి, జనసేన నాయకుడు బోగినేని కాశి రత్తయ్య, సీతారామపురం చెరువు అధ్యక్షుడు నీలి రత్నయ్య, సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
