- ముఖ్య అతిథులుగా కొమ్ముల కన్నబాబు, వెలుగుల నాని, అంబటి బుజ్జి
ప్రత్తిపాడు, జూలై 24 (జనస్వరం): ప్రత్తిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ జాన్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, ప్రత్తిపాడు సీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలుగుల నాని, యువ నాయకుడు అంబటి బుజ్జి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యా పురోగతి, హాజరు శాతం, విద్యార్థుల ప్రతిభ, పాఠశాలలో అందుతున్న విద్యా వసతులపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ముఖ్య అతిథులు ఆకాంక్షించారు. మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను వెలుగుల నాని అభినందించి రూ.2 వేల నగదు బహుమతిని అందజేశారు. అలాగే విద్యార్థుల ఎన్ఎంఎంఎస్ పరీక్షల సన్నద్ధత కోసం అవసరమైన అధ్యయన సామగ్రి కొనుగోలుకు మదినే దొరబాబు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి శ్రీనివాస్, రావుల తాతాజీ, జెడ్డా రాజేంద్ర, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మాదే రాజేంద్రకుమార్, కమిటీ సభ్యులు ముద్దు నాగమణి, అరుణ, సామ్యూల్, ఉపాధ్యాయులు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
