నెల్లిమర్ల, నవంబర్ 28, (జనస్వరం) : ఖరీఫ్ సీజన్ 2025–26కు సంబంధించి రైతులకు న్యాయమైన మద్దతు ధరను నేరుగా అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో అల్లాడపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ప్రభుత్వానికే ధాన్యం విక్రయించే అవకాశం ఈ కేంద్రంతో కలుగుతుందని చెప్పారు. మద్దతు ధర హామీ, మధ్యవర్తుల తొలగింపు, పారదర్శక సేవల అమలే ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. అల్లాడపాలెంలో ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు పారదర్శకంగా బరువు తూకం, వెంటనే రసీదు జారీ, వేగవంతమైన కొనుగోలు ప్రక్రియ, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సహాయ కౌంటర్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, సంఘ నాయకులు పాల్గొని ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవాన్ని హర్షాతిరేకాలతో స్వాగతించారు. రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చే ఈ కార్యక్రమం వల్ల ప్రాంతవ్యాప్తంగా సానుకూల స్పందన కనిపించింది.