ఏలూరు అస్వస్థతపై సర్కారు ఉదాసీనత - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రుల పాలవుతున్న రోగుల సంఖ్య ఏలూరులో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 600 మందికిపైగా ఆస్పత్రి పాలవగా సుమారు 470 మంది డిశ్చార్జు అయినట్లు ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు, అధికారులు చెబుతున్న వివరాల ద్వారా వెల్లడవుతోంది. ప్రజలు ఆందోళనతోనే కాలం గడుపుతున్నారు. ఏలూరులోని కొన్ని ప్రాంతాలవాసులు వేరే ఊళ్లకు వెళ్లిపోతున్నారంటే అక్కడి పరిస్థితిని మనం అర్ధం చేసుకోవచ్చు.
డాక్టర్ శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి నేతృత్వంలో డాక్టర్ శ్రీ బొడ్డేపల్లి రఘు గారు, డాక్టర్ శ్రీ ఎమ్.వెంకటరమణ గారు నేను చెప్పిన వెంటనే మంగళవారం నాడు ఏలూరు వెళ్లి అక్కడ వివిధ ప్రాంతాలలో పర్యటించి నాకు నివేదికను అందజేశారు. వారు పేర్కొన్న వివరాలను పరిశీలిస్తే చిన్న చిన్న వసతులను సైతం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోందో అర్ధంకావడం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఐ.సి.యు లేకపోవడం, ఈ అంతుచిక్కని వ్యాధి రోగులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయకుండా సాధారణ రోగుల వార్డుల్లోనే చికిత్సలు అందించడం, ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఉన్న 500 పడకల ఆస్పత్రిలో న్యూరోఫిజీషియన్ లేకపోవడం వంటి విషయాలు చాలా బాధ కలిగిస్తున్నాయి.
బాధితులు ఫిట్స్ కు గురవుతున్నారంటే చికిత్స అందించవలసింది న్యూరోఫిజీషియన్ అయినప్పుడు కనీసం పక్కనున్న విజయవాడ నుంచి అయినా న్యూరోఫిజిషియన్లను ఏర్పాటు చేయవచ్చు కదా? ఈ వ్యాధికి కలుషిత నీరు కూడా ఒక కారణంగా భావిస్తున్న తరుణంలో బాధిత ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా మంచినీరును ఎందుకు సరఫరా చేయడం లేదు? ఇటువంటి ప్రశ్నలకు శ్రీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పరిస్థితులను చక్కదిద్దాలి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన తరువాత కూడా ఇక్కడ ఎటువంటి అదనపు సదుపాయాలు ఏర్పాటు కాకపోవడం గమనించ తగ్గ విషయం. ఏలూరులో సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు కోరారు.