జనరల్ బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు – జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు..

   అమరావతి, (జనస్వరం) : ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో మన దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటన అత్యంత బాధాకరం. అత్యున్నతమైన సీడీఎస్ బాధ్యతలను స్వీకరించిన తొలి అధికారి అయిన జనరల్ రావత్ దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయం. త్రివిధ దళాలను సమన్వయపరచి దేశ రక్షణ వ్యవస్థను పటిష్టపరచే కీలక బాధ్యతల్లో ఉన్న ఆయన మృతి దేశానికి తీరని లోటు. జనరల్ రావత్, ఆయన సతీమణి శ్రీమతి మధులికలతోపాటు మరో పదకొండు మంది రక్షణ దళాల అధికారులు ఈ దుర్ఘటనలో మరణించడం దిగ్భ్రాంతి కలిగించింది. వీరిలో చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ సాయితేజ ఉన్నారని తెలిసి బాధపడ్డాను. వీరి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా తరఫున, జనసేన పక్షాన నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కోలుకోవాలని కోరుకొంటున్నాను.