శెట్టూరు (మాకొడికి), ఫిబ్రవరి 14 (జనస్వరం): విద్యా వ్యవస్థ బలోపేతానికి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తోంది. “మన ఊరు – మన బడి” భావనతో యువత, పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని చేసిన పిలుపుకు గ్రామాల్లో మంచి స్పందన కనిపిస్తోంది. మాకొడికి గ్రామ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి రమణ నాయక్ తన పాఠశాల అభివృద్ధి కోసం రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. తాను చదువుకున్న పాఠశాలపై ఉన్న మమకారంతో ప్రస్తుత విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందించానని తెలిపారు. ఎమ్మెల్యే పిలుపుతో ప్రేరణ పొందిన యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావడం గ్రామస్తుల్లో హర్షం కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా పూర్వ విద్యార్థుల బాధ్యత కూడా అని రమణ నాయక్ చర్య ద్వారా స్పష్టమైందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. చిన్న మొత్తమైనా సరే సమాజానికి ఉపయోగపడేలా ఖర్చు చేయడం గొప్ప విషయమని స్థానిక నాయకులు కొనియాడారు. పాఠశాల అభివృద్ధికి చేయూతనిచ్చిన రమణ నాయక్ను ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేస్తే ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఎదుగుతాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. యువతలో సేవాభావం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.