2024 ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గంలో జగన్ రెడ్డి అభ్యర్థి భుజంపై చేయి వేసి, ‘‘మీకు మంచి అభ్యర్థిని అప్పజెప్పుతున్నాను’’ అంటూ ప్రచారం చేసిన దృశ్యాలు ఇప్పటికీ ప్రజల కళ్ల ముందు ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేశ్ లాంటి వ్యక్తులను ప్రజలకు ‘మంచి అభ్యర్థులు’గా పరిచయం చేశారు. కానీ ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్న నిజం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా బయటపడింది. అప్పట్లో జగన్ రెడ్డి గురించి ఎంత గొప్పగా చెప్పినా, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పాలనను, ఆయన ఎంపిక చేసిన అభ్యర్థులను ప్రజలు విశ్వసించలేదన్నదే కఠినమైన వాస్తవం.
అప్పుడు ఇదంతా ‘మూడ్ ఆఫ్ ఏపీ’ అంటూ తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే పదాన్ని పట్టుకుని కొత్త సర్వేల పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజల్లో ఉన్న ప్రశ్న ఒక్కటే – ఇది నిజంగా మూడ్ ఆఫ్ ఏపీనా? లేక మూడ్ ఆఫ్ జగన్ రెడ్డీనా? ఇది ఆత్మసాక్షి సర్వేనా? లేక సాక్షి సర్వేనా? లేక తాడేపల్లి ఫ్యాలెస్లో కూర్చొని రచించిన ఊహా కథనా? అన్న అనుమానం ప్రతి ఆంధ్రుడి మనసులో ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలలే అయింది. అంతకుముందు ఐదేళ్లు వైసీపీ పాలనలో రాష్ట్రం ఎలా గాడి తప్పిందో ప్రజలు కళ్లారా చూశారు. చెట్లకు నీళ్లు పోసిన పాపాన పోలేదు.. ఉన్న చెట్లను కూడా నరికి వేసిన పాలన అది. ఉద్యోగాల కల్పన లేదు, పరిశ్రమల ఆహ్వానం లేదు. ఒక పారిశ్రామికవేత్త కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసిన పాపాన పోలేదు. పైగా ఉన్న పరిశ్రమలను కూడా భయపెట్టి తరిమేశారు. రాజధాని ఏది అని అడిగితే నాలుగు అప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోమంటూ ప్రజలనే గందరగోళంలోకి నెట్టిన పాలన అది.
అప్పట్లో జగన్ రెడ్డి ‘వై నాట్ 175’ అన్నారు. దానికి అనుగుణంగా అన్ని సర్వే సంస్థలు కూడా జగన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తాడని, 150 దాటుతాడని, 160 సాధిస్తాడని, చివరికి 175 కూడా సాధ్యమేనని ఉదరకొట్టాయి. తీరా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. సర్వేలు ఎలా అబద్ధమయ్యాయో, ప్రచారం ఎలా బూటకమైందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. అందుకే ఇప్పుడు మళ్లీ అదే తరహా సర్వేల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఇదే సమయంలో సీఎం చంద్రబాబు పాలనను పరిశీలిస్తే ఒక స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఎక్కడ ఏ పథకం ప్రారంభించినా, మధ్యలో వెనక్కి తగ్గిన దాఖలాలు లేవు. రాష్ట్రం కోసం నిరంతరం పని చేస్తున్న నాయకుడు చంద్రబాబు. 75 ఏళ్ల వయస్సులో కూడా తెలుగు వారి భవిష్యత్తు పట్ల ఆయనకు ఉన్న అంకితభావం ఏ స్థాయిలో ఉందో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులు, రూ.25 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించిందంటే, అది కేవలం పాలనా ప్రకటన కాదు.. అది సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్కు వచ్చిన నమ్మకం. రాష్ట్రం అభివృద్ధి పథంలో అడుగులు వేస్తుంటే, అది చూసి ఓర్వలేక కొన్ని బులుగు మీడియా సంస్థలు, వాటి అనుబంధ యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు సర్వేలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి.
ఎన్నికల తర్వాత బయటకు రాని మాజీ మంత్రులు, నేతలు ఒక్కసారిగా బయటకు వచ్చి ‘‘కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు 80 శాతం రెడ్ జోన్లో ఉన్నారు’’ అంటూ మాట్లాడటం చూస్తేనే అర్థమవుతోంది.. ఇది ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే సర్వే కాదని, అసెంబ్లీకి అసలు వెళ్లని వాళ్లు గ్రీన్ జోన్లో ఎలా ఉంటారు? అసెంబ్లీకి వెళ్లి, నియోజకవర్గంలో పని చేస్తున్న ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఎలా ఉంటారు? అనే సాధారణ ప్రశ్నలకు కూడా సమాధానం లేని సర్వే ఇది.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ‘రివర్స్ టెండరింగ్’ పేరుతో ఎంత గందరగోళం సృష్టించారో, ఇప్పుడు ఈ సర్వే కూడా అలాగే రివర్స్లో తయారైంది. చూసిన కొద్దీ ఇది ఏపీ ప్రజల మూడ్ను చెప్పే సర్వే కాదని, ఎన్నికల్లో ఓడిపోయి మూలన కూర్చున్న వైసీపీ నేతలకు మనోధైర్యం నింపేందుకు రూపొందించిన చిల్లర ప్రయత్నమని స్పష్టమవుతోంది.
ఊరు పేరు లేని ఒక మీడియ సంస్థ పేరుతో, ఒక పీడీఎఫ్ ఫైల్ను రిలీజ్ చేసి, కావాల్సిన పేటీఎం ఛానళ్ల ద్వారా, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా దానిని వైరల్ చేయించే ప్రయత్నం జరిగింది. ఇది శాస్త్రీయ సర్వే కాదు, విశ్వసనీయత లేని చిత్తు కాగితాల ప్రచారం మాత్రమే. అందుకే దీన్ని ‘మూడ్ ఆఫ్ ఏపీ’ అనడం సరికాదు. ఇది ‘మూడ్ ఆఫ్ వైసీపీ’ సర్వే, ఇంకా చెప్పాలంటే ‘మూడ్ ఆఫ్ వీపీ’ సర్వే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
మెతుకు పట్టుకుంటే అన్నం ఊడికిందో లేదో తెలుస్తుంది. కానీ అన్నం ఎసరా తల మీద పోసుకుంటే కాలుతుందే తప్ప, అన్నం ఊడికిందో లేదో తెలియదు. ఇప్పుడు ప్రచారం చేస్తున్న సర్వేల పరిస్థితి కూడా అంతే. ప్రజల తెలివిని అవమానించే ప్రయత్నాలు ఎంత చేసినా, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు అన్నీ గమనిస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు కాలేదని, పింఛన్లు తొలగించారని ఎంత యాగీ చేసినా, వాస్తవంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో వస్తున్న స్పందనను చూసి, ఆ ప్రచారం పని చేయడం లేదని తెలుసుకుని ఈ కొత్త నాటకానికి తెరతీశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక సర్వేల మాయలో పడే స్థితిలో లేరు. వారు పాలనను చూస్తున్నారు, పనిని చూస్తున్నారు, భవిష్యత్తును అంచనా వేస్తున్నారు. తాడేపల్లి ఫ్యాలెస్ నుంచి ఎంత కుట్రలు పన్నినా, ఎంత తప్పుడు ప్రచారం చేసినా, ప్రజలను మభ్యపెట్టే రోజులు ముగిశాయి. ఇదే ఈ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన అసలైన మార్పు.
జమ్ము.సాయి కల్యాణ్,
పొలిటికల్ అనలిస్టు.