
ఎస్వీయూ, తిరుపతి, అక్టోబర్ 21, జనస్వరం : శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఔషధ మొక్కల పెంపు, హెర్బల్ చికిత్సలపై ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు రెండేళ్ల పీజీ కోర్సు, ఏడాది పీజీ డిప్లమో కోర్సుల ప్రారంభం దిశగా కసరత్తు మొదలైంది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆవుల చంద్రశేఖర్ యూనివర్సిటీని సందర్శించారు. నూతన ఉపకులపతి ప్రొఫెసర్ టాటా నరసింహారావును కలిసి మర్యాదపూర్వకంగా సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో విసితో పాటు ఎస్వీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. భూపతి నాయుడు, బోటనీ విభాగం ప్రొఫెసర్లు ప్రొ. టి. విజయ, ప్రొ. జె. కామాక్షి, ఫైనాన్స్ ఆఫీసర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను చర్చించారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కోర్సుల ప్రారంభానికి వర్సిటీ అధికారులు సానుకూలతను వ్యక్తం చేశారు. రెండేళ్ల పీజీ కోర్సు, ఏడాది పీజీ డిప్లమా కోర్సులకు అవసరమైన సిలబస్ విషయం కూలంకషంగా చర్చించారు. ఎస్వీయూ ప్రాంగణంలో ఔషధ మొక్కల నర్సరీని పెంచడానికి రూ. 6.50 లక్షల నిధులను విడుదల చేసినట్లు బోర్డు సిఈఓ ఆవుల చంద్రశేఖర్ ప్రకటించారు. హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకోసం తగిన ప్రతిపాదనలను పంపితే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు వర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
